శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (21:46 IST)

ఏపీ పర్యాటకరంగం విస్తరిస్తుంది... వివరాలు...

అమరావతి: పర్యాటక రంగం విస్తరణకు అపార అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అన్నారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సేవల రంగం పనితీరును సమీక్షించారు. పర్యాట రంగంలో ఉపాధి ఎక్కవగా

అమరావతి: పర్యాటక రంగం విస్తరణకు అపార అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అన్నారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సేవల రంగం పనితీరును సమీక్షించారు. పర్యాట రంగంలో ఉపాధి ఎక్కవగా లభించే అవకాశం ఉందన్నారు. మన రాష్ట్రంలోని బీచ్‌లను గోవాలో మాదిరి అత్యంత ఆకర్షణీయంగా రూపొందించడంతోపాటు పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ముఖ్యంగా విమానాశ్రయాలకు అందుబాటులో ఉన్న బీచ్‌లను అభివృద్ధి పరచాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్‌లు అందుబాటులో ఉంచాలన్నారు.
 
సముద్రతీర ప్రాంతాల్లో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బీచ్‌లో పిల్లలను ఆకర్షించేవిధంగా గేమ్స్, వివిధ రకాల ఆటలు అందుబాటులో ఉంచాలన్నారు. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజంతోపాటు పట్టణాలకు సమీపాలలో ఉండే పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. అలాగే సరస్సులను అభివృద్ధి చేయడంతోపాటు వాటర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నిటితోపాటు పర్యాటకులు ఎక్కవగా రావడానికి విమాన సర్వీసులు, వారు ఉండటానికి స్టార్ హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. 
 
కృష్ణా, గోదావరి నదీ తీరాల్లో విజయవాడ, రాజమండ్రి వంటి చోట్ల  ఆధునిక బోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే నగరాల్లో, ఇతర పర్యాటక ప్రాంతాల్లో క్యాబ్ సౌకర్యాన్ని పెంచాలని సీఎస్ చెప్పారు. కడప-హైదరాబాద్ విమాన సర్వీస్ అందుబాటులో ఉందని, కడప నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరులకు, విశాఖ నుంచి గజదల్ పూర్ కు విమాన సర్వీసులు డిసెంబర్ లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు. డిసెంబర్ నుంచి ఇండిగో కొత్తసర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరులకు డిసెంబర్ నుంచి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 
 
వచ్చే వేసవి నుంచి విజయవాడ నుండి సింగపూర్‌కు విమాన సర్వీసు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విమానాశ్రయాల్లో చేతితో తయారుచేసిన వివిధ వస్తువులు, చేనేత వస్త్రాలు అమ్మకానికి ఒక షో రూమ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించమని అధికారులకు చెప్పారు. త్వరలో వెయ్యి క్యాబ్‌లు అందుబాటులో ఉంచేవిధంగా ఓలా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఆ సంస్థవారు విశాఖలో తమ ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విశాఖలో అద్దెకు బైకులు ఇస్తున్నట్లు చెప్పారు.
 
అమరావతిలో మెగా శిల్పారామం, విశాఖ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తిలలో ఆరు శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో సీఆర్డీఏ స్థలం కేటాయించవలసి ఉందన్నారు. ‘మేడ్ ఇన్ ఏపీ’ పేరుతో 500 రకాల ఉత్పత్తులు తయారుచేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.500 కోట్లతో కిరాణా షాపులు ఏర్పాటు చేసే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో, బ్యాంకుల స్థాయిలో ఎన్నెన్ని ఏర్పాటు చేయాలో తరువాత జరిగే రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసి) సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 
 
కేంద్రం ఆదేశాల ప్రకారం జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రతి అయిదు కిలోమీటర్లకు బ్యాంకు ఉండేవిధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. తరువాత మన రాష్ట్రంలో కూడా పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లో అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో త్వరలో  ఆంధ్రాబ్యాంకు రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో 600 నుంచి 700 మంది ఉద్యోగులు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 3 అర్బన్, 6 సెమీ అర్బన్ రిటైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
ఆ పార్కులలో అమ్మకాలు జరిపే స్థానిక ఉత్పత్తులు పచ్చళ్లు, జీడిపప్పు, బెల్లం, గార్మెంట్స్ వంటి వస్తువులతో ఒక ప్రకాళిక రూపొందించమని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర,  ప్లానింగ్ శాఖ కార్యదర్శి సంజయ్ గుప్త,  సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు మల్లాది కృష్ణానంద్ తదితరులు పాల్గొన్నారు.