1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (17:18 IST)

వైకాపా నేత హత్య : మాజీమంత్రి కొల్లు రవంద్రకు బెయిల్

వైకాపా నేత మోకా భాస్కర రావు హత్య కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మచిలీపట్నం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. అయితే, 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ హత్య కేసులో అరెస్టు అయిన రవీంద్ర గత జూలై 6వ తేదీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వైసీపీ నాయకుడు, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో సహకారం అందించారనే ఆరోపణతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపురం వద్ద జూలై 3న అస్టు చేసిన విషయం తెల్సిందే.
 
మోకా భాస్కరరావు జూన్ 29న హత్యకు గురయ్యారు. మోకా భాస్కరరావు మంత్రి పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మచిలీపట్నం 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మోకా భాస్కరరావు జూన్ 29న పట్టణంలోని చేపల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై వెనుదిరిగారు. 
 
అదేసమయంలో ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. గుండెల్లో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయనను ఆటోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఏ4 నిందితుడిగా చేర్చారు.