1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (12:10 IST)

శివరాత్రి రోజున నోటిలో నుంచి శివలింగాల్ని తీసే బాలసాయి ఇకలేరు

వివాదాస్పద స్వామి బాల సాయిబాబా ఇకలేరు. పుట్టపర్తి సాయిబాబా తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న ఈ కర్నూలు బాలసాయిబాబా మంగళవారం కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంకు బండలో ఉన్న ఆశ్రమంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
తనను తాను బాబాగా చెప్పుకునే బాలసాయి ప్రతి యేటా శివరాత్రి రోజున నోటిలో నుంచి శివలింగాల్ని తీస్తూ వివాదస్పద వ్యక్తిగా ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. తాను ఐదు పీహెచ్‌డీలు చేశానని, విధే తనను బాబాగా చేసిందని ప్రచారం చేసుకున్న బాలసాయి, తాను ఎప్పుడూ ఏ దేవుడికీ పూజలు చేయలేదని గతంలో పలుమార్లు ప్రకటించారు. 
 
1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి 18 ఏళ్లకే తొలి ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. వైద్య, తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి రాయ్‌పూర్‌లోని కళింగ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఇక, బాలసాయిపై పలు వివాదాలు, కేసులు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి భారీగా విరాళాలు సేకరించి, ఆస్తులు కూడగట్టుకున్నట్టు కేసులు నమోదయ్యాయి. 
 
భక్తులు తనను దేవుడు అనుకుని వస్తే దైవాన్ని, తాను సోషలిస్టు, కమ్యునిస్టుననీ.. ఓ రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు దేవుడినని ప్రచారం చేసుకున్నారు. వేంకటేశ్వర స్వామి మీరు ఒకటేనా అని ప్రశ్నిస్తే.. 'ఎప్పటికప్పుడు ఆర్చితీర్చే నేను ఎక్కువా.. బండ రూపంలో ఉండే ఆయన ఎక్కువా' అని సమాధానం ఇచ్చి హిందువుల ఆగ్రహాన్ని చవిచూశారు. 
 
పుట్టపర్తి సాయిబాబాయే తనలా పేరు మార్చుకుని ఉండొచ్చుగా.. ఆయన గురించి కాకరకాయ కథలు ఎన్ని వచ్చాయో తెలుసు కదా.. అసలు ఆయన గురించి ఆయన దగ్గర ఉన్నవారి కంటే నాకే ఎక్కువ తెలుసంటూ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. పెళ్లెందుకు చేసుకోలేదని అడిగితే నేను స్త్రీనా. పురుషుడినా.. నపుంసకుడినా.. అసలు పెళ్లంటూ ఉంటుందా అని ప్రశ్నించి నివ్వెరపరిచారు.