గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (14:10 IST)

సీఎం రమేష్‌కు కీలక పదవి... మోడీ - షా ఆశీస్సుల పుణ్యమేనా?

తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికై, ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్‌కు కేంద్రంలో కీలక పదవి దక్కింది. ప్రజా పద్దుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ)లో ఆయన్ను ఓ సభ్యుడుగా లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా నియమించారు. ఈ మేరకు పీఏసీ కొత్త సభ్యులను జాబితాను పీఏసీ కార్యాలయం విడుదల చేసింది. ఈ పీఏసీ ఛైర్మన్‌గా లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ తరపున విపక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరిని స్పీకర్ ఎంపిక చేశారు. 
 
పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ ఒకటి. ఈ కమిటీలో సభ్యుడిగా రాజ్యసభ తరపున సీఎం రమేశ్‌ను తీసుకున్నారు. అలాగే లోక్‌సభలో వైకాపా సభ్యులు బాలశౌరికి చోటుకలల్పించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఏర్పాటు చేశారు. 
 
ఇకపోతే, లోక్‌సభ కమిటీలో లోక్‌సభ నుంచి మొత్తం 15 మందిని, రాజ్యసభ నుంచి ఏడు మందిని ఈ కమిటీలో సభ్యులుగా తీసుకున్నారు. ఈ మేరకు మొత్తం 22 మందిని తీసుకున్న కేంద్రం.. ఇంకా ఇద్దరు రాజ్యసభ నుంచి ఇద్దర్ని తీసుకోవాల్సి ఉంది. ఆ ఇద్దరి పేర్లను కేంద్రం ఇంకా పెండింగ్‌లో పెట్టింది. 
 
అయితే, సీఎం రమేష్‌ను సభ్యుడుగా తీసుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సొంత పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంలో సీఎం రమేష్ కీలక భూమిక పోషించిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిఫలంగానే సీఎం రమేష్‌కు పీఏసీలో సభ్యత్వం కల్పించినట్టు ప్రచారంసాగుతోంది. 
 
కాగా, ఈ పీఏసీలో సభ్యత్వం కల్పించిన లోక్‌సభ సభ్యుల్లో టీఆర్ బాలు, సుభాష్ చంద్ర బహారియా, అధిర్ రంజన్ చౌదరి, సుధీర్ గుప్తా, దర్శన్ విక్రమ్ జర్దోష్, భత్రుహరి మహతాబ్, అజయ్ మిశ్రా, జగదాంబికా పాల్, విష్ణు దయాళ్ రామ్, రాహుల్ రమేష్ షెవాలే, రాజీవ్ రంజన్ సింగ్, సత్యపాల్ సింగ్, జయంత్ సిన్హా, బాలశౌరి వల్లభనేని, రాం కృపాల్ యాదవ్‌లు ఉండగా, రాజ్యసభ నుంచి రాజీవ్ చంద్రశేఖర్, నరేష్ గుజ్రాల్, సీఎం రమేష్, సుఖేందు శేఖర్ రాయ్, భూపేందర్ యాదవ్‌లకు చోటు కల్పించగా, మరో రెండు స్థానాలను భర్తీ చేయలేదు. వీరంతా మే 1వ తేదీ 2020 నుంచి ఏప్రిల్ 30, 2021 వరకు సభ్యులుగా ఉంటారు.