శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (18:22 IST)

అమరావతికి అనుకూలంగా మాట్లాడితే వేటే : బీజేపీ చర్యలు

ఏపీ రాజధాని అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ తన వైఖరిని తేటతెల్లం చేసింది. రాజధాని అంశం అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుందని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. అంటే ఏపీ రాజధానితోగానీ, మూడు రాజధానుల ఏర్పాటు అంశంతోగానీ తమకెలాంటి సంబంధం లేదని బాహాటంగా స్పష్టం చేసింది. కానీ, ఏపీకి చెందిన పలువురు బీజేపీ నేతలు అమరావతికి, రాజధాని ప్రాంత రైతులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
అలా అమరావతికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసే వారిపై బీజేపీ ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా సస్పెండ్ చేస్తోంది. ఇటీవల మూడు రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో తితిదే బోర్డు మాజీ సభ్యులు ఓవీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 
 
తాజాగా మరో నేతపై సస్పెండ్ వేటు పడింది. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణ‌ను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 
 
'అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదు. రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని పార్టీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ.. రైతుల పక్షాన నిలబడటం లేదని మీ ఆరోపణ నిరాధారమైనది. 
 
పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక వార్తాపత్రికలు మరియు టెలివిజన్ ఛానెల్స్ మీ తప్పుడు ఆరోపణలకు విస్తృత ప్రచారం ఇచ్చాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అధ్యక్షుల సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం' అంటా ఆయనకు పంపించిన లేఖలో సోము వీర్రాజు పేర్కొన్నారు.