శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (07:17 IST)

యోగాకు వెళతారా.. మత్తులో ముంచి నగ్నంగా వీడియో తీసి దోచేస్తారు జాగ్రత్త నాయనా!

మాదక ద్రవ్యాలను అమ్మాలంటే చట్టవిరుద్దంగా, రహస్యంగా, భారీ నెట్ వర్క్‌లతో చేయాల్సిన పెద్ద పని అనుకోవలసి పనిలేదు. ఎవరి బుట్టలోనైనా ఈజీగా పడిపోయే మనస్తత్వం భారతీయులది కాబట్టి కాస్త తెలివి ఉపయోగిస్తే భక్తిమార్గంలో కూడ మన దేశ జనాలను, ముఖ్యంగా మన సంపన్న, మ

మాదక ద్రవ్యాలను అమ్మాలంటే చట్టవిరుద్దంగా, రహస్యంగా, భారీ నెట్ వర్క్‌లతో చేయాల్సిన పెద్ద పని అనుకోవలసి పనిలేదు. ఎవరి బుట్టలోనైనా ఈజీగా పడిపోయే మనస్తత్వం భారతీయులది కాబట్టి కాస్త తెలివి ఉపయోగిస్తే భక్తిమార్గంలో కూడ మన దేశ జనాలను, ముఖ్యంగా మన సంపన్న,  మధ్యతరగతి జనాలను బురిడీ గొట్టించి తర్వాత గుండుకొట్టించడం చాలా సులభం. విశ్వనగరం హైదరాబాద్‌లో ఇలా కూడా బతికేయవచ్చని ఘరానా దంపతులు ప్రపంచానికి చాటి చెప్పేశారు. యోగా శిక్షణ పేరుతో ధనికులను టార్గెట్‌ చేసి వారిని మత్తు మందులకు బానిసలు చేసి.. నగ్న వీడియోలు తీసి తర్వాత  వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బు దోచుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చి ఔరా అనిపిస్తోంది. ఈ ఘరానా నేరానికి పాల్పడిన వారి వివరాలను హైదరాబాద్‌ పోలీసులు  మీడియాకు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లోని హిసాద్‌ నగర్‌కు చెందిన జగదీశ్‌ కేండీ, ఆయన భార్య కిరణ్మయి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. హిసాద్‌నగర్‌కే చెందిన ఉషశ్రీ అనే మహిళ నడిపిస్తున్న యోగా శిక్షణ కేంద్రం గురించి వెబ్‌సైట్‌లో ప్రచురించిన ప్రకటనను చూసి గత నెలలో కిరణ్మయి, జగదీశ్‌ చేరారు. ఈ నేపథ్యంలో యోగా శిక్షణ పేరుతో ఉషశ్రీ వారిద్దరికీ మత్తు మందు ఇచ్చింది. అలా భార్యాభర్తలను మత్తు మందులకు బానిసలుగా చేసి.. వారి వద్ద నుంచి 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదును ఉషశ్రీ దోచుకుంది. 
 
అనంతరం వారి వద్దనున్న మరో రూ.10 లక్షల నగదును తీసుకునేందుకు ప్రణాళిక వేసింది. ఇందుకోసం భక్తి ప్రయాణం పేరుతో తీసుకెళ్లి కుండలిని అనే యోగా నేర్పిస్తామని వారికి చెప్పింది. భర్త శ్రీకాంత్‌ రెడ్డితో కలసి ఉషశ్రీ.. కిరణ్మయి, జగదీశ్‌లకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి వారిని ఈనెల 3వ తేదీన తమిళనాడుకు తీసుకెళ్లింది. 4న శ్రీరంగం ఆలయం వద్ద అద్దె భవనంలో మూడు రోజులు ఉంచారు. అనంతరం గత శుక్రవారం ఉదయం తిరువణ్ణామలైలోని మాడవీధుల్లోగల ఓ లాడ్జిలో ఉంచారు. 3వ తేదీన కిరణ్మయి, జగదీశ్‌లకు బంధువులు ఫోన్‌ చేశారు. 
 
ఆ సమయంలో వారిద్దరూ తడబడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణలో ఉషశ్రీ వీరిద్దరినీ కిడ్నాప్‌ చేసి తమిళనాడుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా పరిశీలించగా తిరువణ్ణామలైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
 
యోగా శిక్షణ పేరుతో డబ్బులు దండిగా ఉన్న ధనికులను గుర్తించి వారిని మత్తుకు బానిస చేయడం, వారి వద్ద నుంచి నగదు దోచుకోవడం తరచూ చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. బాధితులు మత్తులో ఉన్న సమయంలో వారిని నగ్నంగా చేసి వీడియో తీసి.. దానితో బ్లాక్‌ మెయిల్‌చేసి నగదు దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి మత్తుకు ఉపయోగించే వస్తువులు, క్రెడిట్, డెబిట్, ఆధార్, రేషన్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
అయినా గుండు కొట్టించే వారిదా గొప్పతనం? రోజు ఏదో ఒక చోట, ఎవరో ఒకరు అలా గుండు కొట్టించుకోవడానికి బకరాలు సిద్ధంగా ఉన్న మన దేశంలో గుండు కొట్టడం పెద్ద కష్టమైన పనా మరి.