రాజమండ్రిలో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్లో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం నుంచి పొదలకురుకు వెళుతున్న ఓ బస్సు జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసుల వివరాల ప్రకారం రాజమండ్రిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై రాజానగరం నుంచి వస్తున్న బస్సు మోరంపూడి జంక్షన్లో ఒక కారును, మూడు బైకులను ఢీకొని జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బస్సులో బ్రేక్ ఫెయిలైన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. కాగా వైకాపా నేత జగన్ మోహన్ రెడ్డి దీక్షకు జనాలను తరలిస్తున్న బస్సు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ వద్ద విచారణ జరుపుతున్నారు.