శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 9 మే 2018 (14:48 IST)

అందుకే ఓటుకు నోటు కేసుపై సమీక్ష.. కేసీఆర్‌ను నడిపేది మోదీనే: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓటుకు నోటు కేసులో ఇప్పటికే జైలుకెళ్లొచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమీక్ష

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓటుకు నోటు కేసులో ఇప్పటికే జైలుకెళ్లొచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా కొందరు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారన్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగమే ఓటుకు నోటు కేసుపై సమీక్ష అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని.. కేసీఆర్ తీరును మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం వుందని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే కేసీఆర్ గంటల పాటు ఓటుకు నోటు కేసుపై చర్చించారని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్యాయం చేస్తున్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇంకా తెలంగాణలో టీఆర్ఎస్‌ వైఫల్యాలపై తాము పోరాటం చేస్తుండటంతోనే.. తనను, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరిపారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను కాంగ్రెస్‌ సభల్లో పాల్గొంటూ కేసీఆర్‌ సర్కారు ఎన్ని కోట్ల రూపాయల అనినీతికి పాల్పడిందో వివరిస్తున్నానని తెలిపారు. వెనక నుంచి కేసీఆర్‌ను నడిపించేది ప్రధాని మోదీనేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. 
 
మరోవైపు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తుండటంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు ఒక అక్రమ కేసు అంటూ మత్తయ్య పిటిషన్ వేసిన సమయంలోనే హైకోర్టు కామెంట్ చేసిందని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు విచారిస్తున్న కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా సమీక్ష నిర్వహిస్తారని ప్రశ్నించారు.