శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (09:13 IST)

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ... లక్ష్మీనారాయణ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహారాష్ట్ర క్యాడర్‌ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఈ కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఈనెల 26వ తేదీన ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి స్వయంగా వివరించనున్నారు. 
 
సీబీఐ జాయింట్ డైరెక్టరుగా ఆయన ఉన్న సమయంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్ధన్‌ రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా ఆయన పేరు మార్మోగిపోయింది. ఈ కేసులను విచారించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. 
 
ప్రభుత్వ సేవలో ఉన్నప్పటినుంచే ఆయన గ్రామీణ సమస్యలపై, ప్రత్యేకించి రైతుల ఇక్కట్లపై అధ్యయనం చేశారు. పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి రైతులతో మమేకమయ్యారు. వారి సాధకబాధకాల్ని స్వయంగా తెలుసుకున్నారు. అనేక కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్యపరిచారు. 
 
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని ప్రస్తావిస్తూనే.. బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలంలో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆహ్వానించిందని ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఆయన విరామమిస్తూ సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.