శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:45 IST)

ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాను కానీ... కేంద్రాన్ని ఒప్పించలేక పోయా : చంద్రబాబు

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని గట్టిగా పట్టుబట్టానని, కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక పోయినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని గట్టిగా పట్టుబట్టానని, కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక పోయినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదాతో ఒనగూరే ప్రయోజనాలను ప్యాకేజీతో భర్తీ చేస్తామంటేనే ఓకే చెప్పానని స్పష్టం చేశారు. విజ్ఞతతో ఆలోచించే దీనికి అంగీకారం తెలిపానని పేర్కొన్నారు. 
 
తాను తప్పటడుగు వేస్తే యావత్ రాష్ట్రానికే నష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాను హోదా కోసమే పట్టుబట్టానని, అయితే  కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు సాయం చాలా అవసరమని, అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి అంగీకరించినట్టు పేర్కొన్నారు. హోదాపై కొందరు గాలి మాటలు మాట్లాడుతున్నారని, హామీలపై చట్టబద్ధతకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారని వివరించారు. 
 
'హోదా వల్ల వచ్చే ప్రతీ ఒక్క దాన్ని ప్యాకేజీతో భర్తీ చేస్తామని కేంద్రం చెప్పింది. విజ్ఞతతో ఆలోచించా. విభజన జరిగి రెండున్నర సంవత్సరాలు గడిచింది. రాష్ట్రం పూర్తిగా కష్టాల్లో ఉంది. ఇప్పుడు సాయం కావాలి. అన్నీ ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీకి అంగీకరించాం' అని బాబు చెప్పుకొచ్చారు. వైసీపీ, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుప్పిగంతులు వేసినా, కుట్రలు చేసినా ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తానైతే అభివృద్ధి చేయగలననే నమ్మకంతోనే గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేసే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.