1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (14:57 IST)

ప్రాణ భయంతో పరాయి రాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబు: మంత్రి పేర్ని నాని

కరోనాలో చంద్రబాబు రొచ్చు రాజకీయం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుక్క తోక వంకర అన్నట్టు చంద్రబాబు బుద్ధి మారదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంకా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ....
 
ప్రాణ భయంతో పరాయి రాష్ట్రంలో రాజప్రాసాదం లాంటి పెద్ద భవంతుల్లో తలదాచుకుంటున్న చంద్రబాబు నాయుడికి చేతనైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే నాలుగు మంచి సలహాలు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా.. కుక్క తోక వంకర అన్నట్లుగానే ఆయన మాటలు, చేష్టలు ఉన్నాయి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. తన ప్రాణాల కోసం, తన కుటుంబం మొత్తం ఆనందం కోసం, పరాయి రాష్ట్రంలో దాక్కుని పనికి మాలిన మాటలు మాట్లాడటం విచారకరం. కరోనా మహమ్మారి కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా చంద్రబాబు నైజం బయటపడుతుంది.
 
ప్రజల్లో చెక్కుచెదరని అభిమానాన్ని నింపుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిపైన పదే పదే దుష్ప్రచారం చేయటం,  కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగాన్నంతటినీ సమాయత్తం చేసి, అహర్నిశలు శక్తియుక్తుల్ని ఒడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. తన కొడుకు భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల మేలును పరిగణలోకి తీసుకోకుండా, ఆఖరికి చావుల్లో, కరోనా మహమ్మారిలో కూడా రాజకీయాలను వెతికి పట్టుకుని, కాదేదీ అనర్హం అన్నట్టుగా అన్నింట్లో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం, దిగజారుడు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా నీతిమాలిన చర్యలకు చంద్రబాబు పాల్పడటం అత్యంత హేయమైన చర్య. జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలోని  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిపాలనపరంగా, సంక్షేమ పాలన పరంగా ఎక్కడా తప్పుబట్టలేక, రాజకీయం చేయటం లేదంటూనే చంద్రబాబు మరింత రొచ్చు రాజకీయం చేస్తున్నాడు.
 
మన రాష్ట్రం గురించి, పరాయి రాష్ట్రాల్లో, దేశాల్లో లేనిపోని నిందల్ని చంద్రబాబే ఆపాదిస్తూ, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నుంచే ఎన్ 440 కె వైరస్ వ్యాప్తి చెందిందని నీచాతినీచంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ.. పరాయి రాష్ట్రాల్లో మన రాష్ట్రం గురించి తక్కువగా , నీచంగా మాట్లాడుకోవడానికి చంద్రబాబే అవకాశం కల్పిస్తున్నాడు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంపై లేనిపోని నిందలు మోపి,  అబద్ధాలను పోగేసి తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఏమనాలి..!?. ఎవరైనా మన రాష్ట్రం గురించి తప్పుడు మాటలు మాట్లాడితే.. ఖండించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆపనిచేయకపోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పనిగట్టుకుని చంద్రబాబే దుష్ప్రచారం చేయడం నీతి బాహ్యమైన చర్య. 
 
ఆంధ్రప్రదేశ్ లో వైరస్ బలహీనమైనదని, వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్ 440కె రకం బయటపడిందని, అది చాలా వేగంగా అంతర్థానమైందని.. చంద్రబాబు రాజ గురువు పత్రికలోనే  కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ చెప్పినట్లు రాశారు.  ఏపీలో కొత్త రకం వైరస్ లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఎవరో మాట్లాడుతున్నారని చంద్రబాబు అబద్ధాలను పోగేసి ఆంధ్రప్రదేశ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బయట నుంచి ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే, అటువంటి వ్యాఖ్యలను ఖండించాల్సిందిపోయి, ఈ రాష్ట్ర ప్రజలు 13 ఏళ్ళపాటు ఆదరించినా.. ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్షకట్టినట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించడం దారుణం. కరోనా సమయంలోనూ దిక్కుమాలిన రాజకీయాలు ఎందుకు చంద్రబాబూ..!? కనీస ఇంగితజ్ఞానం ఉన్నా ఇలా చేయరు. వయసు 70 ఏళ్ళు పైబడ్డా, కొడుకు భవిష్యత్తు కోసం ఇంతగా బరితెగించి మాట్లాడవచ్చా..?
 
ఆన్ లైన్ లో కరోనా పేషెంట్లకు బెడ్లు, ఆక్సీజన్ కనపడటం లేదని చంద్రబాబు నీచంగా మాట్లాడుతున్నాడు. ఇదేమైనా బస్సుల రిజర్వేషన్ అనుకున్నారా...? లేక ఆసుపత్రిలో పేషెంట్లను చేర్చుకోవడం ముఖ్యమా...? చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగేనాటికి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ దుస్థితి ఏమిటో చూశాం. ఆయన హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఎన్ని ఉన్నాయి, వెంటిలేటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు, అసలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళే పరిస్థితి అప్పుడు ఉందా.. అన్నది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు హయాంలో కేవలం ఒకే ఒక్కటి వైరాలజీ ల్యాబ్ ఉంది. ఈరోజు ల్యాబ్ లు పెంచాం, పరీక్షలు పెంచాం, ప్రైవేటు ఆసుపత్రులకంటే దీటుగా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేశాం. 

ఈరోజు రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి 3 లక్షల 17 వేలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాం. కోవిడ్ నియంత్రణకు ఆసుపత్రుల్లో 44,542 బెడ్లు సిద్ధంగా ఉంచాం. ప్రభుత్వ చర్యలన్నింటి వల్ల, 0.69 శాతం మోర్టాలిటీ రేటు ఉంటే, 7.2 శాతం పాజిటీవిటీ రేటు ఉంది. 85.16 శాతం రికవరీ రేటు ఉంది.
 
కోవిడ్ బారిన పడి, ఆసుపత్రుల్లో చేరిన అర్హులైన ప్రతి ఒక్కరికీ రెమెడ్ సివర్ ఇంజక్షన్లు కొరత లేకుండా అందుతున్నాయి. అలానే ఆక్సీజన్‌కు ఇబ్బంది రాకుండా ఒరిస్సా నుంచి ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా, సింగపూర్ నుంచి తెప్పిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై సీఎం జగన్ గారు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్ని చేస్తుంటే.. ఏమీ చేయలేదని మాట్లాడటానికి చంద్రబాబుకు నోరు ఎలా వస్తుంది..?
 
ఆక్సీజన్ కేటాయింపులు చేస్తున్నదీ, రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపులు చేస్తున్నదీ మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే. ఆ విషయం తెలిసి కూడా కేంద్రాన్నిగానీ, ప్రధాని మోడీ గారిని గానీ ఒక్క మాట మాట్లాడుతున్నావా చంద్రబాబూ.. ? లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని లేని అంశాలపై నిందలు మోపడానికి, రాష్ట్రంపై అభాండాలు వేయడానికి చంద్రబాబు స్పృహ ఉండే మాట్లాడుతున్నాడా,  అసలు చదువుకున్నాడా.? అన్నది ఆయన తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి.
 
కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే వ్యాక్సిన్ లు సరఫరా చేస్తుంది. ఈరోజు ఉదయం 10-11 గంటల వరకు, ఈరోజు వచ్చిన 2.65 లక్షలతో కలుపుకుని కేంద్రం నుంచి అందిన వ్యాక్సిన్లు 73, 49,960.  ఇందులో మొదటి  డోస్ కింద 51, 98, 958, రెండో డోస్ కింద 15, 43,745 వ్యాక్సిన్లు. మొత్తం రెండు డోస్ లు కలుపుకుంటే 67 లక్షల 42 వేలు 700.
 
భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా.. ప్రతి రోజు 6 లక్షల వ్యాక్సిన్లు వేయగల సన్నద్ధత దేశంలో ఒక్క ఏపీకే ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇటీవల వ్యాఖ్యానించింది. కేంద్రం వ్యాక్సిన్ సమృద్ధిగా ఇస్తే.. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగల సామర్థ్యం ఒక్క ఏపీకే ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 
 
ఇంత పకడ్బందీగా, సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే.. వ్యాక్సిన్ లు ఆర్డర్ పెట్టలేదని నీతిబాహ్యంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాటలు వింటుంటే, ప్రజా ప్రతినిధులతోపాటు ప్రజలకు కడుపు రగిలిపోతుంది. అవాస్తవాలు, అసత్యాలతో తప్పుడు రాతలు రాయించి, తప్పుడు మాటలు చెబుతూ చంద్రబాబు ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు.
 
18 నుంచి 45 ఏళ్ళ వయసు ఉన్న వారు రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల మంది ఉంటే.. వీరికిగాను కేవలం 13 లక్షల వ్యాక్సిన్ లు ఇచ్చి, అది కూడా ఒక్కో వ్యాక్సిన్ రూ. 400 చొప్పున కొనుక్కోండని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. 45 ఏళ్ళు పైబడిన వారు 1.33 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కేంద్రానికి లేఖలు రాస్తుంటే చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. వ్యాక్సిన్ లపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము చంద్రబాబుకు లేదు.
 
వ్యాక్సిన్ లపై కడుపు రగిలిపోతుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. వ్యాక్సిన్ ల పంపిణీ, కేటాయింపులు, మోనిటరింగ్..తదితర అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే.. మోడీని ఒక్క మాట అనే దమ్ము చంద్రబాబుకు లేదు. గతంలో ఇదే చంద్రబాబు ఎన్నికల ముందు నాకు భార్య ఉంది.. నీకు లేదు, నాకు కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు.. నీకు లేరు అని నోటికొచ్చినట్లు మోడీని మాట్లాడారు. ఈరోజు కాలుగాలిన పిల్లిలా నోరు మెదపడం లేదు.
 
చంద్రబాబు అంత అనుభవం లేకపోయినా, యువ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిగారు సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ..  దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శెభాష్ అనిపించుకుంటున్నారు. వయసులో చిన్నవారైనా, జగన్ మోహన్ రెడ్డిగారు ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తుంటే, అది చూసి సిగ్గు తెచ్చుకోవాల్సింది పోయి చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నాడు. చివరికి, మా రాష్ట్రానికి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడే పరిస్థితిని తెచ్చుకుంటున్నాడు.  
 
కోవిడ్ అంశాన్ని కేబినెట్ లో చిట్ట చివరి అంశంగా పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశం కాబట్టి, దానిపై ఎంత సమయం కావాలంటే అంత సమయం సుదీర్ఘంగా చర్చించుకోవాలనే ఉద్దేశంతోనే అలాపెడితే, 13 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడం సిగ్గు చేటు. కోవిడ్ పైనే కేబినెట్ సమావేశంలో 2 గంటలకు పైగా చర్చించాం. చంద్రబాబు మాటలు చూస్తుంటే..  అసలు ఈయన ముఖ్యమంత్రిగా  పనిచేశాడా.. లేక.. ఈయన స్థానంలో ఎవరైనా పనిచేశారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 
 
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా పార్టీ లేదు, తొక్కలేదు, ఏప్రిల్ 17 తర్వాత అంతా చాపచుట్టుకోవడమే అని చెప్పారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు...? రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ముందు చూపుతో,  ప్రతి అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా, చిన్న వయసులోనే దేశంలోనే గొప్పగా జగన్ గారు పరిపాలన చేస్తుంటే.. చంద్రబాబు విషం  చిమ్మే కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసం..?
 
13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా..? చంద్రబాబు హయాంలో.. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంటే.. ఈరోజు తగుదునమ్మా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళవి నోళ్ళా.. లేక డ్రైనేజీలా..?
 
కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు మొదటి నుంచీ స్పష్టమైన విధానంతో ఉన్నారు. కోరనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆనాడు మాట్లాడితే.. ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు నోరు పారేసుకున్నారు, హేళనగా మాట్లాడారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డిగారు ఏమైతే చెప్పారో, ప్రధాని, ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా దేశంలోని ప్రముఖులంతా అవే మాటలు మాట్లాడారు. వీళ్లు ఎన్ని దొంగ నాటకాలు ఆడినా, దొంగ మాటలు మాట్లాడినా.. టీడీపీని, చంద్రబాబును ప్రజలు విశ్వసించరు.