1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (15:56 IST)

జగన్ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ మనల్ని అమ్మేస్తాడు : చంద్రబాబు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఒక్క సీటులో కూడా గెలవకూడదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకవేళ ఒక్క సీటులో గెలిచినా ఆ సీటుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మనల్ని అమ్మేస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఇది పరీక్షా సమయమని, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణతో ఏపీకి ఎంతో అన్యాయం జరిగిందని, నెత్తిన అప్పుతో వచ్చి రాష్ట్రంలో పడ్డామని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతిని ఎంతో క్షోభకు గురిచేశారని, ప్రజల కోసం పోరాడుతున్న తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
 
ఎన్నికలకు ఎంతో సమయం లేదని, చంద్రబాబు కావాలో? కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కేసుల కోసం లాలూచీపడి హైదరాబాద్‌లో కూర్చున్న వారు కావాలో? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వారు కావాలో తేల్చుకోవాలని కోరారు. జగన్, కేసీఆర్, నరేంద్ర మోడీలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
ముఖ్యంగా, కేసీఆర్, మోడీలకు ఊడిగం చేసే జగన్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. తనకు రిటర్న్‌గిఫ్ట్ పంపిస్తానన్న కేసీఆర్‌కు వంద గిఫ్టులు పంపిస్తానన్నారు. ఏపీలో జగన్ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ దానిని ఢిల్లీకి తీసుకెళ్లి మనల్ని అమ్మేస్తాడని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.