శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 29 మే 2017 (07:54 IST)

మాహిష్మతి రాజ్యాన్ని అంత భారీగా ఎందుకు నిర్మించాం.. ఇతర రాజులు, దూతలను భయపెట్టాలనే: రాజమౌళి

బాహుబలి-2 చిత్రంలో మాహిష్మతి రాజ్యం ఎంత పెద్దదంటే ఇంతవరకు భారతీయ చిత్ర రంగంలోని ఏ సినిమా కూడా ఇంత భారీ రాజ్యం సెట్టింగును నిర్మించలేదు. ఆ రాజ్యంలో కోట గోడలు, రాజమందిరాలు, అక్కడి జంతువులు, రాజులు, రాణులు, సేనానులు, సైనికులు కూడా భారీతనం ప్రదర్శిస్తూ చ

బాహుబలి-2 చిత్రంలో మాహిష్మతి రాజ్యం ఎంత పెద్దదంటే ఇంతవరకు భారతీయ చిత్ర రంగంలోని ఏ సినిమా కూడా ఇంత భారీ రాజ్యం సెట్టింగును నిర్మించలేదు. ఆ రాజ్యంలో కోట గోడలు, రాజమందిరాలు, అక్కడి జంతువులు, రాజులు, రాణులు, సేనానులు, సైనికులు కూడా భారీతనం ప్రదర్శిస్తూ చూడగానే గుండెలదరగొడుతుంటారు. ఇంత భారీతనాన్ని సినిమాలో చూపించడానికి బాహుబలి దర్శక నిర్మాతలు అంత ఖర్చు ఎందుకు పెట్టారన్నది సిల్లీ ప్రశ్న కాదు. దానికి చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పే సమాధానం కూడా సిల్లీగా ఉండదు.
 
తెరపై బాహుబలిని అద్భుతంగా చిత్రీకరించిన దర్శకుడు రాజమౌళిని... అమరావతి నిర్మాణంలో భాగస్వామి కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానించి  నవ్యాంధ్ర రాజధానిని మాహిష్మతి అంత భారీతనం ఉట్టిపడేలా చూపడంలో సహకరించవలసిందిగా కోరారన్న విషయం తెలిసిందే. కానీ దానికి రాజమౌళి తన అశక్తతను తెలుపుతూ మాహిష్మతిని అంత భారీగా కట్టడానికి కారణాన్ని చెప్పారు. 
 
బాహుబలిలోని మాహిష్మతిని ఎలా డిజైన్‌ చేశారని చంద్రబాబు అడిగారు. ‘‘మేం సినిమా కోసం రాజుతోపాటు... రాజ్యాన్ని (కింగ్‌డమ్‌) కూడా డిజైన్‌ చేశాం. అక్కడ ఏం పండుతాయి, ఎలాంటి ఖనిజాలు ఉంటాయి, ఏం తింటారు, ఏం కట్టుకుంటారు... ఇలాంటివన్నీ రాసుకున్నాం. ప్రతి ఆర్కిటెక్చర్‌కు ఒక ఫిలాసఫీ ఉంటుంది. పెద్ద భవనాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఎందుకు ఉండాలి దానికి కారణాలేమిటి అనేది కూడా రాసుకున్నాం. మాహిష్మతి రాజులు సుపీరియర్‌గా ఉండాలనుకుంటారు. అందరికన్నా గొప్పగా కనిపించాలి. వాళ్లవద్దకు ఎవరైనా వేరే రాజులు, దూతలు వస్తే... తల ఎత్తి పైకి చూడాలి. అయ్‌బాబోయ్‌ వీళ్లేంటి ఇంత గొప్ప... అని అనుకోవాలి. సైకలాజికల్‌గా భయపెట్టాలనే ఉద్దేశం! అందుకు ఇలా డిజైన్‌ చేశామని చంద్రబాబుకు చెప్పాను. ఆ కాన్సెప్ట్‌ ముఖ్యమంత్రి గారికి బాగా నచ్చింది’’ అని రాజమౌళి వివరించారు.
 
‘‘మేం అమరావతిని పీపుల్స్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మీ ఫిలాసఫీని దీనికి అప్లై చేయండి’’ అని చంద్రబాబు చెప్పారు. అంటే... మొత్తం అమరావతికి కాదని... సచివాలయం, హైకోర్టు భవనాల అప్పియరెన్స్‌ కోసమని తెలిపారు. ‘‘నేను ఎంత చేయగలనో నాకు తెలియదు. అది చేయడానికి తలలు పండిన ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్‌లు ఎందరో ఉన్నారు. నాకు ఆ నాలెడ్జ్‌ లేదు. సినిమా నాలెడ్జ్‌ ఉంది. మేం వేసిన సెట్‌ ఎన్ని రోజులు ఉంటుంది! కానీ... రాజధాని కొన్ని వందల సంవత్సరాలు నిలిచిపోతుంది. ఇదంతా సీఎం గారికి చెప్పాను. అయితే, మీకు ఇంత నాలెడ్జ్‌ ఉందికదా... అమరావతికి ఎంత కాంట్రిబ్యూట్‌ చేయగలిగితే అంత చేయండి అని అన్నారు. సరే సర్‌ అని బదులిచ్చాను’’ అని రాజమౌళి చెప్పారు.
 
‘‘అమరావతి కోసం నేను ఏదైనా ఒక ఐడియా ఇవ్వగలిగి, అది అందరికీ నచ్చి, నిర్మాణంలో అదీ ఒక భాగమైతే అంతకంటే గర్వకారణం ఏముంటుంది! అది పెద్ద గౌరవం. గ్రేట్‌ ఫీలింగ్‌. కొన్ని వందల సంవత్సరాలపాటు నిలిచే కట్టడమది. మనం పోయిన తర్వాత కూడా మన పాత్ర మాత్రం నిలిచిపోతుంది. ఇది నిజంగా గొప్పే!’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
 
ఇంటర్ మాత్రమే చదివి, సినిమా పని మాత్రమ చేసుకుంటున్న రాజమౌళిని అమరావతి రాజధాని డిజైన్‌ విషయంలో సహకరించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన వార్త కొంత కాలంగా సంచలనం రేపుతోంది.