శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (07:00 IST)

స్వామీ... ఇదేమీ..! 17 యేళ్ళకే కొంపలుకూల్చే వ్యవహారం..!! చితకబాదిన జనం.

గుంటూరులో ఓ గుంటడు 15 యేళ్లకే జీవిత సారాన్ని మరపట్టి తాగేశాడట. 17 యేళ్ళకే స్వామీజీ అవతారమెత్తాడు.... కల్లబొల్లి మాటలతో కాలంగడపక... కలహభోజన ప్రియుడిగా మారి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే పని మొదలు పెట్టాడు. స్వామిజీ బండారం బయటపడడంతో జనం చితకబాది పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం, చెరుకుపల్లి చెందిన రామారావు కుటుంబం రెండు సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం నరసరావుపేటలోని శ్రీనివాస్‌నగర్‌కు వలస వచ్చారు. కొడుకుకి చదువు అబ్బకపోయేసరికి ఇటుకల బట్టీలో పనికి పెట్టారు. కష్టపడి పని చేయలేని రామారావు, తల్లిదండ్రులతో కలిసి తనను స్వామీజీగా అవతారమెత్తాడు... నాలుగు మాటలు చెప్పి జనం నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. ఇలా జరుగుతున్న తరుణంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సౌమ్య అనే మహిళ పిల్లలు పుట్టకపోవడంతో రామారావు దగ్గరకు వచ్చింది. 
 
‘మీవారి పంపించండి’ అని రామారావు ఆమెకు సెలవిచ్చాడు. సౌమ్య తన భర్తను స్వామీజీ వద్దకు పంపించింది. రామారావు ఆమెపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పాడు. దీంతో రామారావు స్వామీజీ చెప్పింది నిజమని నమ్మి సౌమ్యకు విడాకులివ్వడానికి తన భర్త సిద్దపడ్డాడు. ఈ విషయాన్ని సౌమ్య తన కుటుంబ సభ్యలకు తెలియజేసింది. విషయం విన్న సౌమ్య పిన్ని మన స్వామీజీ రామారావు దగ్గరకు వెళ్లింది. ఆమె కూడా తనకు పిల్లలు పుట్టడం లేదని చెప్పింది. ‘‘నువ్వు 3 నెలల గర్భవతివి. నీకు మగ పిల్లాడు పుడతాడు. ఆ అబ్బాయికి నాపేరు పెట్టుకో.’’ అని ఆమెతో స్వామీజీ రామారావు చెప్పాడు. 
 
కానీ  అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. పైగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆరు సంవత్సరాలు అయింది. దీంతో రామారావు బండారం బయటపడింది. అతడు స్వామీజీ కాదని, డబ్బు కోసం అబద్దాలు చెబుతూ కాపురాలు కూలుస్తున్నాడని సౌమ్య బంధువులు ఆరోపించారు. స్థానికులకు విషయం తెలియడంతో రామారావుకు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కలహాల స్వామిజీ కటకటాల పాలయ్యాడు.