చెక్ బౌన్స్ కేసు: సినీ నటి జీవితా రాజశేఖర్కు ఊరట
చెక్ బౌన్స్ కేసును హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు కొట్టివేయడంతో ప్రముఖ సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్కు ఊరట లభించింది. 2007లో ఎవడైతే నాకేంటి సినిమా నిర్మాణం సందర్భంగా సామ చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుంచి జీవిత రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి జీవితకు రూ.25లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు తీర్పు నిచ్చింది. ఆపై జీవిత బెయిల్పై విడుదలయ్యారు.
ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసును కోర్టు కొట్టివేయడంతో జీవిత హర్షం వ్యక్తం చేశారు. అనవసరంగా తనను కోర్టుకు లాగారని, తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. కావాలనే తన వద్ద నుంచి చెక్లు తీసుకుని, కేసులో ఇరికించారని మండిపడ్డారు. అయితే జీవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.