శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:40 IST)

కోర్టు ఆదేశించినా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు ఎందుకు చెల్లించ‌రు?

త‌న హ‌యాంలో గ్రామాభివృద్ధి ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌పై ఎందుకు క‌క్ష సాధిస్తున్నార‌ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం జ‌గ‌న్ ని ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, న్యాస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేద‌ని నిల‌దీశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులా? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. జ‌గన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేద‌ని బాబు విమ‌ర్శించారు.
 
గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోంద‌న్నారు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశాడ‌ని, రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు అందించాల‌న్నారు.  
 
గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నార‌ని, వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం హేయమ‌న్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేద‌ని చెప్పారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టింద‌ని తెలిపారు. గుత్తేదారులెవరూ ఆందోళన చెందవద్దు, ఆత్మహత్యలకు పాల్పడవద్ద‌ని, ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున టీడీపీ పోరాటం చేస్తుంద‌న్నారు.