మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (12:50 IST)

కరోనా బాధితుడి ఇంట్లో చోరీ.. దర్యాప్తుకెళ్లిన ఖాకీలకు వైరస్...

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తమ సమ్మేళనానికి వెళ్లి కరోనా వైరస్ అంటించుకున్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ చోరీపై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన నలుగురు పోలీసుకు వైరస్ సోకింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మర్కజ్‌ మత ప్రార్థనలకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ మత ప్రార్థనల ద్వారా ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలియని ఆయన నేరుగా ఇంటికి వచ్చి చూడగా, ఇంట్లో చోరీ జరిగింది. దీంతో నిర్ఘాంతపోయిన ఆయన... తన ఇంట్లో చోరీ జరిగినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుళ్లు నలుగురు ఆయన ఇంటికి వెళ్లి అవసరమైన వివరాలు, ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు వెళ్లిన వారిలో ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. వారిలో తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. 
 
దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు బాధితునితోపాటు అతని ఇంట్లో దర్యాప్తు నిర్వహించిన నలుగురు కానిస్టేబుళ్లను క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వీరి నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చి నెగెటివ్‌ అని తేలితే తప్ప వీరు బయటకు వచ్చే అవకాశం లేదు.