1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (22:43 IST)

కరోనావైరస్ పాజిటివ్, ఇద్దరు కొడుకులకీ చెప్పకుండా కాలువలో దూకేశారు

కరోనావైరస్ ఎంతోమంది జీవితాలను ఛిద్రం చేసేస్తోంది. ఆ వైరస్ వస్తే ఇక చనిపోవడమనే నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. కనీసం చికిత్స చేయించుకునేందుకు సైతం ప్రయత్నించకుండా తనువు చాలిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
తమకు కరోనా పాజిటివ్ వుందని పరీక్షల్లో తేలడంతో వృద్ధ దంపతులు భయంకరమైన వైరస్ వల్ల చనిపోతారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరిలోని రాయవరం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కర్రి వెంకట్ రెడ్డి (71), సావిత్రి దంపతులు మండపేట కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వ్యవసాయం ద్వారా జీవనం సాగించే వెంకట్ రెడ్డి, సావిత్రి ఈ నెల 12వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుండి హోం ఐసోలేషన్లో వుంటున్నారు. వెంకట్ రెడ్డి, సావిత్రికి ఇద్దరు కుమారులు. వ్యాపార రీత్యా ఒకరు ఒడిశాలో వుంటుండగా మరొకరు రాజమండ్రిలో నివశిస్తున్నారు.
 
కాగా ఈ నెల 12వ తేదీ నుండి ఈ జంట ఇంట్లో ఒంటరిగా వుంటున్నారు. ఐతే ఒక రోజంతా ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి వారి కుమారుడికి సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రుల ఆచూకి లేదు. సాయంత్రం మండపేట కాలువలోని మాచవరం గ్రామ సమీపంలో రెండు మృతదేహాలు లభించాయని వార్త రావడంతో అక్కడికెళ్లి చూడగా వారు తమ తల్లిదండ్రులను గుర్తించాడు. కరోనా కారణంగా చనిపోతామన్న భయంతో వారు ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.