కేసీఆర్ కాన్వాయ్కు అధునాతన బస్సు... ఖరీదు రూ.5 కోట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటనల కోసం ఓ ప్రత్యేక బస్సు తయారైంది. అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన బస్సు కొన్నిప్రాంతాలలో ఆయన పర్యటనల కోసం వినియోగిస్తారు. ఈ బస్సు తయారీకి మొత్తం రూ. 5 కోట్ల వరకు ఖర్చయింది.
చండీగఢ్లో తయారుచేసిన ఈ బస్సును.. హైదరాబాద్ నగరానికి గురువారం తీసుకొచ్చారు. రాత్రిపూట బస చేసేందుకు కూడా వీలుగా హైసెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులో అత్యాధునిక హంగులు కూడా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు.
ఇందులో వై-ఫైతో పాటు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనం హైదరాబాద్ నగరానికి రావడంతో.. ముఖ్యమంత్రికి ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇక్కడ కావల్సిన ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. దీన్ని కేసీఆర్కు అందుబాటులోకి తీసుకెళ్తారని అంటున్నారు.