1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:23 IST)

మాటిచ్చిన రెండు రోజుల్లోనే గుడివాడలో ఆస్పత్రిలో పడకల పెంపు!

మాటిచ్చిన రెండు రోజుల్లోనే గుడివాడ పట్టణంలోని అన్నే పుష్పలీలావతి, అన్నే నరసింహారావు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ -19 టెస్టింగ్ ల్యాబ్‌ను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఏర్పాటు చేయించారు. 
 
రెండు రోజుల కిందట ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం ఛైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, ఫలితాల కోసం శాంపిల్స్‌ను విజయవాడకు పంపుతున్నామన్నారు. నాలుగైదు రోజుల తర్వాత ఫలితాలు వెలువడుతుండడంతో కరోనా వైరస్ సోకిన వారు సకాలంలో వైద్యం పొందలేక పోతున్నారన్నారు. 
 
కోవిడ్ -19 టెస్టింగ్ ల్యాబ్ ను ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే మంత్రి కొడాలి నాని స్పందించి రెండు రోజుల్లో టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయిస్తానని మాటిచ్చారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో ఫోనులో మాట్లాడి కోవిడ్ -19 టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 30 వ తేదీ నుండి గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. 
 
ప్రభుత్వాసుపత్రిలోనే ఒకవైపు కరోనా పరీక్షలు జరుగుతుండగా మరోవైపు ఒక్క రోజులోనే ఫలితాలు వెలువడేలా మంత్రి కొడాలి నాని చర్యలు తీసుకున్నారు. అంతేగాక కోవిడ్ కేర్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయించారు. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్, నాన్ కోవిడ్ విభాగాలకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది. 
 
మంత్రి కొడాలి నాని ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కోవిడ్ కేర్ విభాగంలో ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లు, కోవిడ్ రోగులకు అవసరమైన ఇతర వైద్య పరికరాలను పరిశీలించారు. శుక్రవారం నుండి గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ -19 రోగులకు కూడా వైద్యసేవలు అందనున్నాయి.
 
 రాష్ట్రంలో ట్రూనాట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. కోవిడ్ చికిత్స కోసం 422 ఆసుపత్రులకు అనుమతులిచ్చారన్నారు. ఐసీయూ, ఆక్సిజన్, జనరల్ బెడ్లను అందుబాటులో ఉంచామన్నారు. బెడ్ వివరాలను ఆన్లైన్ లో చూడవచ్చన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపు 29 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామన్నారు. 
 
రాష్ట్రంలో కోవిడ్ టీకాకు భారీ స్పందన వచ్చిందని, దీంతో ఆయా వ్యాక్సిన్ నిల్వలను ప్రభుత్వం కూడగడుతోందన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో 3 లక్షల కోవిడ్ టీకా డోన్లు వచ్చాయన్నారు. అక్కడి నుండి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సినను తరలించారన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ తరలివెళ్ళనుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.