శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 11 జులై 2017 (20:49 IST)

‘డ్వాక్రా’ గ్రూపుల నిర్వాహణలో తుఫాను షెల్టర్లు...

ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని 9 తీర ప్రాంత జిల్లాల్లో 138 అత్యాధునిక సైక్లోన్ షెల్టర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. 7.18 లక్షల మందికి దీని వల్ల ప్రయోజనం కలకనుంది. 960 కి.మీల పొడవున సముద్ర తీరమున్న రాష్ట్రంలో తరచూ తుపానులు సంభ

ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని 9 తీర ప్రాంత జిల్లాల్లో 138 అత్యాధునిక సైక్లోన్ షెల్టర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. 7.18 లక్షల మందికి దీని వల్ల ప్రయోజనం కలకనుంది. 960 కి.మీల పొడవున సముద్ర తీరమున్న రాష్ట్రంలో తరచూ తుపానులు సంభవించడంతో.. 1977 దివిసీమ ఉప్పెన తరువాత రాష్ట్రంలోని 1142 తుపాను షెల్టర్లను ప్రభుత్వం నిర్మించింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న వాటికి తరచూ నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో చాలా కాలంగా అవి నిరుపయోగంగా మారాయి.
 
తిరిగి వీటిని పునరుద్ధరించాలని, వినియోగంలోకి తేవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, కొంతకాలంగా కోస్తా జిల్లాల్లో అమలవుతున్న పలు అభివృద్ధి పనులు తరచూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా విధ్వంసాలకు గురవుతున్నవని గుర్తించిన ప్రపంచ బ్యాంకు ఇందులో తానూ భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వచ్చింది. 
 
మన దేశానికున్న 7,516 కి.మీ సముద్ర తీర ప్రాంతంలో 5,700 కి.మీ సాధారణ మైదాన ప్రాంతం కావడంతో ఇక్కడ జన సమ్మర్థం ఎక్కువ. సముద్ర వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం ఈ ప్రాంతం మీద తీవ్రంగా ఉంటుంది. వేగమైన గాలులు, కుంభవృష్ఠి సర్వసాధారణమైన అంశం. కోస్తా జిల్లాల జనాభాలో 40 శాతం ఈ సముద్ర వాతావరణ ప్రభావిత ప్రాంతాల్లో ఒక వంద కి.మీల వ్యాసంలో ఉంటారు. ప్రధానంగా వీరంతా పేదవర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాలు. ఇక్కడ తరచుగా వచ్చే తుఫానుల వల్ల సంభవించే మరణాలు, ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్తి నష్టం ఎక్కువ. 
 
ఒక నిరంతర ప్రక్రియ సాగుతున్న వృద్ధి క్రమానికి ఇది ప్రధాన అడ్డంకిగా తయారయింది. దీంతో ఒక్క ఆంధ్రప్రదేశ్ కే రూ. 771 కోట్లు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. అయితే, ఈ సామాజిక, ఆశ్రయ భవనాల నిర్వణ బాధ్యత స్థానిక సమాజాలకే అప్పగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. దాంతో ప్రభుత్వం- కమ్యునిటీ బేస్డ్ సైక్లోన్ సెంటర్ మేనేజ్ మెంట్- మెయింటెనెన్స్ వెల్ఫేర్ కమిటీ(CSM - MWC) లను నియమించాలని ప్రతిపాదించింది. 
 
తీర ప్రాంతలో నిర్మిస్తున్న కొత్త తుపాను షెల్టర్ల నిర్వాహణ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ సంఘాలకు అప్పగిస్తూ జులై 2015లో జీ.ఓ జారీ చేసింది. కాగా ఇప్పుడు వీటి నిర్మాణం తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి, ఈ స్వయం సహాయ సంఘాలు నిర్వాహణ మొదటి నుంచి  కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతినివ్వడంతో, ఇప్పుడు  ఈ తుఫాను షెల్టర్ల నిర్వహణ, జమా ఖర్చులు తదితరాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వాహణ ‘సెర్ప్’ త్వరలో చేపట్టనుంది.
 
కాగా నూతన నిబంధనల ప్రకారం ఈ తుఫాను షెల్టర్లను తుఫానులు వచ్చినప్పుడు మాత్రమే షెల్టర్లుగా వాడాలి. తరువాత ఏడాది పొడవునా పాఠశాల భవనాలు లేనిచోట తరగతి గదులుగాను, అవసరమైనప్పుడు ఫంక్షన్లకు అద్దెకు ఇవ్వడం, అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ, స్థానిక వృత్తి పనివారు వినియోగించుకోవడానికి శిక్షణా తరగతులు, వైద్య శిభిరాల నిర్వహణ వంటి సామాజిక అవసరాలకు వినియోగిస్తారు.
 
2000 చ.గ ప్రాంగణాల్లో 3000 చ.అడుగుల బిల్డప్ ఏరియాలో ఒకేసారి 1500 మంది ఆశ్రయం పొందే విధంగా వీటిని నిర్మిస్తారు. వీటిలో ఒక కంట్రోల్ రూం, హ్యామ్ రేడియో, బయట ప్రాంతం సమాచారం తెలుసుకోవడానికి కోసం వైర్లెస్ సెట్ ఉంటాయి. మూడు అంతస్థుల్లో ఉండే ఈ భవనాల్లో క్రింది అంతస్థులో స్థానికులు ఆశ్రయం పొందే రోజుల్లో తమ పశువుల్ని ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన వెయిటింగ్ హాళ్లు , వంటగది, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఉంటాయి. ఈ భవనాల వద్దకు చేరుకోవడానికి రోడ్లు, వంతెనలు కూడా నిర్మిస్తారు. పంచాయతిరాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్మిస్తున్న ఈ తుఫాను షెల్టర్ల వివరాలు ఇలా వున్నాయి- శ్రీకాకుళం-34, విజయనగరం-4, విశాఖపట్టణం-17, తూర్పుగోదావరి-19, పశ్చమగోదావరి-6, కృష్ణా-9, గుంటూరు-8, ప్రకాశం-8, నెల్లూరు- 25. అక్టోబర్ 2013 లో వచ్చిన ‘ఫిలిన్’ తుఫాన్ ఉత్పాతం తీవ్రతను ప్రామాణికంగా తీసుకుని ఈ తుఫాను ఆశ్రయ భవనాల నిర్మాణంలో ఇంజనీరింగ్ ప్రమాణాలను రూపొందించారు. వీటి నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీలేని విధంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.