శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (15:39 IST)

జగన్‌కు మరో ఎదురుదెబ్బ... కాంగ్రెస్ పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యే

arthar - sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ టాటా చెప్పేశారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైకాపాను ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వీడిపోయారు. ఆ జాబితాలో తాజాగా ఆర్థర్ కూడా చేరిపోయారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్‌కు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు టిక్కెట్‌ను ఆర్థర్‌కు కాకుండా మరో వైకాపా నేత దారా సుధీర్‌కు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్‌కు తీవ్ర మనస్తాపం కలిగించింది. అంతేకాకుండా, ఇటీవల నందికొట్కూరు మార్కెట్ కమిటీ పాలక వర్గం ఎన్నికల్లో కూడా వైకాపా నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బైరెడ్డి ప్రతిపాదించిన వ్యక్తికే చైర్మన్ పదవి దక్కింది. 
 
ఈ నేపథ్యంలో బైరెడ్డి వర్గానికి చెందిన వారికి మార్కెట్ పాలకవర్గ పదవులు దక్కించుకోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ జీర్ణించుకోలేకపోయారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి గండ్రెడ్డి ప్రతాపరెడ్డి పేరును ఆర్థర్ ప్రతిపాదించగా, అక్కడ కూడా ఆయనకు నిరశే ఎదురైంది. పైగా, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కూడా ఎమ్మెల్యే ఆర్థర్‌కు విభేదాలు ఉన్నట్టు సమాచారం.