శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:20 IST)

దిశ కేసులోని నిందితులు చనిపోయారు.. సో.. కేసు క్లోజ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నలుగురు నిందితులు చనిపోయారనీ, అందువల్ల దిశ కేసును క్లోజు చేయాలని కోర్టును షాద్ నగర్ పోలీసులు కోరనున్నారు. ఇందుకోసం షాద్‌నగర్‌ కోర్టులో రిపోర్టు దాఖలు చేసి కేసు క్లోజ్‌ చేసేందుకు అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
 
ఈ కేసులో నలుగురు నిందితులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తు చేసే వీలులేనందున కేసు క్లోజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తునకు ఆస్కారం లేని పలు కేసుల్ని గతంలో పోలీసులు కోర్టు అనుమతితో క్లోజ్‌ చేశారు. దీంతో ప్రస్తుత కేసులోనూ అదే తరహాలో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. 
 
అదేసమయంలో షాద్‌నగర్‌ పీఎస్‌లో దిశ మిస్సింగ్‌, కిడ్నాప్‌, హత్యాచారానికి సంబంధించి నమోదైన కేసు క్లోజ్‌ అయినా... నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన విచారణ వాస్తవాలు నిగ్గుతేలే వరకు కొనసాగనుంది. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ ఈ వారంలో హైదరాబాద్‌కు వచ్చి విచారణ ప్రారంభించనుంది. 
 
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు నిందితులు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయిన విషయం తెల్సిందే. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో కోర్టులో రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.