1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (19:08 IST)

గుంటూరులో దారుణం.. వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను మరింత క్షోభకు గురిచేసేలా అధికారులు వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనెను అందించారు.

ఈ నూనె ప్యాకెట్ల కాలపరిమితి గత నెలతో ముగిసినప్పటికీ అధికారులు ఆ ప్యాకెట్లను వరద బాధితులకు అంటగట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ..‘వరద వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు వచ్చి సామగ్రి అందించారు. అందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఇచ్చారు. ఇలాంటి చర్యలతో మా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

కాగా, ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కి తీసుకెళ్లినట్లు సమాచారం.