శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:34 IST)

తూ.గో వైపు దూసుకొస్తున్న పెథాయ్ తుఫాను... ఏపీలో హైఅలెర్ట్

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా వైపు దూసుకొస్తోంది. ఇది చెన్నైకు 530 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోవుంది. ఇది ఆదివారం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఈనెల 17వ తేదీన మచిలీపట్నం - కాకినాడల మధ్య తీరందాటొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
కాగా, ఈ పెథాయ్ తుఫాను తీరందాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 
 
ఇదిలావుండగా, తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రటించింది. అలాగే, 50కిపైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 50 వేల నుంచి 75 వేల వరకు విద్యుత్ స్తంభాలను సిద్ధం చేసివుంచింది. అనేక గ్రామాల్లో జనరేటర్లను సిద్ధంగా ఉంచి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ముందస్తు చర్యలు చేపట్టింది. 
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరితో పాటు కోస్తాతీర జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిత్యావసర వస్తువులను భారీ సంఖ్యలో నిల్వవుంచింది. 2200 పేరుతో ఓ ప్రత్యేక నంబరుతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 
 
ఇదిలావుంటే, పెథాయ్ తుఫాను వల్ల తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో ఏపీ సీఎంకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.