శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:22 IST)

భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త మృతి...

భర్తలంటే భార్యలని వేధించి... చంపేసేవారే కాదు... వాళ్లకేమైనా అయితే... తట్టుకోలేకపోయే వాళ్లు కూడా ఉన్నారు కానీ... వేధించే భర్తలలాగా వీళ్లు పెద్దగా పాపులర్ కాలేరు... అటువంటి ఒక సంఘటనే ఇక్కడ చెప్పబోతున్నాం... 
 
వివరాలలోకి వెళ్తే... నూతన్‌కల్‌ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనను గురించి గ్రామస్థులు కథనం మేరకు... నూతనకల్‌ గ్రామానికి చెందిన బండ్లపల్లి శ్రీరాములు, మల్లమ్మకు శంకర్‌, ఆంజనేయులు అనే ఇద్దరు కుమారులు, స్వరూప అనే ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులూ, కుమార్తె జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం చెన్నై వెళ్లగా తల్లిదండ్రులు మాత్రం గ్రామంలోనే ఉంటున్నారు. 
 
సుమారు 9 నెలల క్రితం చెన్నైలో ఉంటున్న కుమారుల వద్దకు ఈ దంపతులు వెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 2వ తేదీన మల్లమ్మ (48) బీపీ పెరిగి చెన్నైలో మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. 
 
కాగా... భార్య మృతిని జీర్ణించుకోలేని శ్రీరాములు మూడో రోజు చితాభస్మం ఎత్తుతూ తీవ్ర మనోవేదనకు గురై స్నానాలు చేసి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మూడురోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమారులు, కుమార్తె విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.