శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (09:09 IST)

ప్రభుత్వ కొలువుకు జేడీ రాజీనామా.. జనసేన పార్టీలో...

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన ప్రభుత్వ కొలువుకు రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్‌ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన ప్రభుత్వ కొలువుకు రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్‌ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఈ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజకీయాల్లోకి వస్తున్నారని, జనసేనలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 
 
బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ)గా ఉన్న సమయంలో తెలుగు ప్రజలకు ఆయన సుపరిచయం. ముఖ్యంగా, వైకాపా అధినేత జగన్‌ మోహన్ రెడ్డితో పాటు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం గనులు వంటి కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహించడంతో బాగా పాపులర్‌ అయ్యారు. 
 
సీబీఐలో డిప్యూటేషన్‌ పూర్తయిన తర్వాత మహారష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నా.. ఏపీ, తెలంగాణలో పాఠశాలల మరమ్మతు పనులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా ఈ అంశంపై మాట్లాడింది లేదు. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయడంతో ఆ ప్రచారం మళ్లీ జోరందుకుంది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాజకీయ రంగంలో అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది.