గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (11:53 IST)

మాజీ సీఎం 'నల్లారి' రీ ఎంట్రీ ఖాయం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమై, జై సమైక్యాంధ్ర పేరుతో ఓ కొత్త పార్టీని స్థాపిం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమై, జై సమైక్యాంధ్ర పేరుతో ఓ కొత్త పార్టీని స్థాపించారు. అయితే, ఈ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత నాలుగేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇపుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను ముఖ్యమంత్రిని కావడానికి కారణమైన కాంగ్రెస్ ప్రస్తుతం ఏపీలో కష్టాల్లో ఉన్నందున స్వచ్ఛందంగా సేవలు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేయాలని యోచిస్తున్నారు.
 
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో విలేకరులతో మాట్లాడుతూ, విభజన వల్ల కాంగ్రెస్ ఇరు రాష్ట్రాల్లోనూ దారుణంగా దెబ్బతింటుందన్నారు. ఆయన అన్నట్టే జరిగింది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావించారు కూడా. 
 
ఈ క్రమంలో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం కోసం తపిస్తున్న ఆ పార్టీ చీఫ్ రాహుల్ ఇప్పటికే కిరణ్‌ కుమార్ రెడ్డితో నేరుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. చీటికిమాటికి అధికారపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రతిపక్ష వైసీపీని కూడా టార్గెట్ చేసుకుంటేనే కాంగ్రెస్‌కు లాభం ఉంటుందని ఈ సందర్భంగా కిరణ్ సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో కిరణ్‌ను రాహుల్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించగా, దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి.