గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (13:36 IST)

తెదేపాకు భారీ షాక్ తప్పదా? : వైకాపా వైపు గంటా మొగ్గు?

విశాఖపట్టణం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, ఆయన అధికార వైకాపాలో చేరబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన చేరికకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి సైతం పచ్చజెండా ఊపినట్టు చెప్పుకుంటున్నారు. 
 
వైకాపాలో చేరే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు ముగిశాయని... వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా చెపుతున్నారు. ఆగస్టు 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజున వైసీపీలో గంటా చేరనున్నట్టు సమాచారం. 
 
మరోవైపు గంటా చేరికపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని... అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉన్నారని చెపుతున్నారు. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే... టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే.. గంటా శ్రీనివాస్ రావు రంగులు మార్చే రాజకీయ పార్టీ నాయకుడు అనే పేరు సార్థకమవుతుంది. ఎందుకంటే.. ఆయన తొలుత టీడీపీ నేత. అపుడు మంత్రిగా ఉన్నారు. పిమ్మట ప్రజారాజ్యంలో చేరి అపుడూ మంత్రిగా కొనసాగారు. అక్కడ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆ సమయంలోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఇపుడు వైకాపాలో చేరితే మరోమారు పార్టీ మారినట్టు అవుతుంది.