1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (06:09 IST)

మద్య నియంత్రణలో జగన్ చర్యలకు సత్ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం సత్ఫలితాలు ఇస్తోంది. మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 నవంబర్‌ లో 29లక్షల 62వేల కేసుల లిక్కర్ ను విక్రయించగా  ఈ ఏడాది నవంబర్‌లో 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే అమ్మారు. దీంతో 24.67 శాతం మేర మద్యం అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది.

బీరు అమ్మకాలు 2018 నవంబర్‌ లో 17లక్షల 80వేల కేసులు అమ్మడుపోగా, ఈ ఏడాది అదే మాసంలో 8 లక్షల 13 వేల కేసులు మాత్రమే విక్రయించారు. దీంతో 54.30 శాతం బీర్ల అమ్మకాల తగ్గుదల నమోదైంది. నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500 లకు తగ్గించారు. అటు బిజినెస్ సమయాన్ని ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పరిమితం చేశారు.
 
కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

గతంలో పర్మిట్ రూములతో కొన్నిచోట్ల, పర్మిట్ లు లేకుండా మరికొన్నిచోట్ల మద్యం సేవించేవారు. ఇప్పుడు పర్మిట్ రూములను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి మాత్రమే పరిమితమవుతున్నాయన్నారు.

గ్రామాలలో కూడా బెల్ట్ షాపులను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో తొలగించడంతో గ్రామాలలో మద్యం వినియోగం భారీగా తగ్గింది.  గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా నిఘా పెట్టడంతో గ్రామాలలో మద్యం తగ్గిందంటున్నారు.
 
అయితే మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదు. భారీగా రేట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి ఆదాయం అలాగే వస్తోంది.  ఎలా చూసినా మద్యం వినియోగం మాత్రం తగ్గిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.