1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 మే 2020 (08:38 IST)

మద్య నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. దశల వారీ మద్య నిషేధం లో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీ మద్యపానంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. అక్రమ మద్యం తయారీ దారులు, రవాణా దారులపై గట్టి నిఘాతో పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తుంది. గడచిన నాలుగేళ్ల తో పోలిస్తే చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వమే అధికంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది వాటి వివరాలు ఇలా ఉన్నాయి...
 
2017 లో మొత్తం 3812 కేసులు నమోదు కాగా 2018 లో 3579 కేసులు నమోదు చేసింది. 2019లో 5422 కేసులు నమోదు చేయగా 2020లో నేటికీ ఏకంగా 7812 కేసులు నమోదయ్యాయి.

ఇక అరెస్టు చేసిన వారి వివరాల్లోకి వస్తే 2017 లో 2487 మంది, 2018లో 2763 మంది, 2019లో 3526 మంది అరెస్ట్ కాగా 2020లో నేటికీ 5877 మందిని ప్రస్తుత ప్రభుత్వం అరెస్టు చేసింది.

నాటు సారా తయారీ పై దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న మద్యం 2017 లో 30084 లీటర్లు కాగా 2018లో 34540 లీటర్లు, 2019లో 56179 లీటర్లు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2020లో నేటికీ 98482 లీటర్ల స్వాధీనం చేసుకుంది.

దీంతోపాటు నాశనం చేసిన బెల్లం ఊట సైతం ఈ ఏడాదిలోనే అధిక మొత్తం రికార్డుయింది. సీజ్ చేసిన వాహనాల వివరాల్లోకి వస్తే 2017 లో 191 వాహనాలు సీజ్ చేయగా.. 2018లో 188.. 2019లో 330 వాహనాలున్నాయి.

అయితే ప్రస్తుత ప్రభుత్వం 2020లో నేటికీ సీజ్ చేసిన వాహనాల సంఖ్య 1541 గా రికార్డు అయింది. ఈ గణాంకాల ప్రకారం మద్య నియంత్రణ,  నాటుసారా తయారీ అక్రమ రవాణాపై వైయస్సార్సీపి ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచడంతో పాటు వాటికి అనుబంధంగా గుడి, బడి ఎక్కడ బడితే అక్కడ బెల్టుషాపులు విస్తరించి మద్యం  ఏరులా ప్రవహింపచేసారు. నేడు అలాంటి వాతావరణం లేకుండా పూర్తి కట్టుదిట్టమైన చర్యలతో దశలవారీ మద్యనిషేధ ఆచరణాత్మక ప్రణాళికను అమలు చేస్తున్నారు. 
 
క్రిందటి నెల( ఏప్రిల్ 22 నుంచి) కోవిడ్  లాక్ డౌన్ ప్రారంభం నుంచి మద్యం దుకాణాలు తెరిచి రోజు వరకు మద్యం అక్రమ తయారీ,  రవాణా పై ప్రత్యేక నిఘా ఉంచాయి.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1462 కేసులు నమోదు చేయగా, 1282 మందిని అరెస్టు చేశారు. 14759 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 363430 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేసి 12718 కిలోల నల్ల బెల్లన్ని, 428 బైకులను సీజ్ చేశారు. 
 
మద్య విమోచన ప్రచార కమిటీ ఎప్పటికప్పుడు ఆయా మద్య నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తుండగా, గ్రామ, వార్డు వాలంటీర్ ల తో పాటు గ్రామాల్లో నియమించిన మహిళా మిత్రాలు, మహిళా రక్షకుల సేవలను కూడా వినియోగించుకుంటూ అక్రమ మద్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.

పక్క రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ అక్రమ మద్యం తయారీ నిల్వ దారులపై సంయుక్తంగా ప్రభుత్వం దాడులు జరుపుతోంది. మద్యం వినియోగం గణనీయంగా తగ్గించేందుకు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపుల సంఖ్య 33 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

తద్వారా మద్యం షాపులు 4380 నుంచి ఈనెలఖరు  నాటికి కేవలం 2934 మాత్రమే పరిమితమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లను కూడా 40 శాతం తగ్గింపుతో మొత్తం 840 బార్లకు గాను530కి  తగ్గాయి. మద్యం ధరల పెంపుతో వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వ సూత్రం సానుకూల ఫలితాలిస్తుంది.

చంద్రబాబు హయాంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లా తెరిచే  మద్యం దుకాణాల తలుపులను ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 11 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు మూసేస్తుంది. పైగా ఒక వ్యక్తికి గరిష్టంగా  లిక్కర్ లేదా బీరు కేవలం 3 సీసాల వరకే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టింది.

అంతకుమించి కొనుగోలు చేసిన అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. షాపుల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్ లను రద్దు చేసింది. ప్రభుత్వం తాజాగా మద్యం అక్రమ తయారీ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం సర్వత్రా స్వాగతించాల్సిన విషయం.

మద్యం వినియోగాన్ని రాన్రానూ తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలనే నిర్ణయంతో ప్రభుత్వం అడుగులేస్తోందనే అనే సత్యాన్ని ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు గుర్తించాలి. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరు శాతం మద్యం దుకాణాలను ఎత్తివేసి 2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.

ఈ మహా సంకల్పం విజయవంతం చేయడమనేది సామాజిక బాధ్యతగా స్వీకరించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మేధావులు,సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు.