నవ వరుడు ఆత్మహత్య... వివాహం రోజునే దారుణం...!
ఒక్కోసారి క్షణికావేశం ప్రాణాల మీదుకు తెస్తుంది. అటువంటి సంఘటనే నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో చోటు చేసుకుంది. కొన్ని గంటల్లో వివాహం చేసుకోవాల్సిన నవ వరుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్కు చెందిన షేక్ హమీద్(24)కు నవీపేట్ మండలం బినోలకు చెందిన యువతితో గురువారం పెండ్లి నిశ్చయించారు.
యువతిని చూసినప్పుడే హమీద్ కుటుంబ సభ్యులు నచ్చలేదని చెప్పారట. హమీద్కు నచ్చటంతో పెండ్లి వరకు వచ్చింది. అయితే పెండ్లి నిశ్చయమైనప్పటి నుంచి కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలతో హమీద్ మనస్తాపానికి గురయ్యాడు. పెండ్లి తర్వాత కూడా ఇవే పరిస్థితులు ఎదురవుతాయని భావించి గురువారం ఒంటరిగా పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వధువు ఇంటికి వెళ్లే సమయం కావడంతో హమీద్ కోసం గాలించగా గ్రామశివారులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హమీద్ను దవాఖానకు తరలించారు. అక్కడ హమీద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వేల్పూర్ పోలీసులు కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.