1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (13:22 IST)

హైదరాబాద్ వర్ష బాధితులకు సినీ నటుల ఆపన్న హస్తం.. ఆహార పొట్లాల పంపిణీ

హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ష బాధితులకు సాయం అందించేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష

హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ష బాధితులకు సాయం అందించేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సినీన‌టులు, శివాజీరాజా, మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్, గౌతంరాజు తదితరులు శనివారం న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. 
 
‘మా’ త‌ర‌ఫున రాజేంద్ర ప్ర‌సాద్ ఆల్విన్‌ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు అంద‌జేశారు. బాధితులకు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అనంత‌రం ధరణినగర్‌లో పర్యటించిన రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాల వాసులకు భరోసాగా ఉంటామని చెప్పారు. నిత్యావ‌స‌ర స‌రుకులు అందిస్తామ‌ని తెలిపారు.
 
ఇకపోతే... జలదిగ్బంధంలో చిక్కుకున్న హైదరాబాద్‌ను కాపాడేందకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. 60 మందితో కూడిన రెండు బృందాలు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటాయని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర తెలిపారు. 
 
ముఖ్యంగా.. నీట మునిగిన అల్వాల్, నిజాంపేట్, ప్రకాష్‌నగర్, ఆల్విన్‌కాలనీ, రాజ్‌భవన్‌రోడ్, ఆనంద్ థియేటర్ ప్రాంతాల్లో నాలుగు ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ చేరుకున్న వెంటనే సైన్యం రంగంలోకి దిగింది. వరద మునకలో ఉన్న అల్వాల్ ప్రాంతంలో ఆహార పదార్థాలను సైన్యం పంపిణీ చేసింది.