గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (12:01 IST)

ప్రియుడి కోసం తండ్రి డబ్బును గుంజేసింది.. రూ.22 లక్షల్ని పక్కా ప్లాన్‌తో?

ప్రియుడి కోసం తండ్రిని మోసం చేసింది. తన ప్రియుడితో కలిసి తండ్రి కష్టపడి దాచిపెట్టిన డబ్బును కాజేసింది. ఇందుకోసం పక్కా ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి దొంగతనం చేయించింది. ఈ క్రమంలో రూ.22లక్షలు దోచుకున

ప్రియుడి కోసం తండ్రిని మోసం చేసింది. తన ప్రియుడితో కలిసి తండ్రి కష్టపడి దాచిపెట్టిన డబ్బును కాజేసింది. ఇందుకోసం పక్కా ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి దొంగతనం చేయించింది. ఈ క్రమంలో రూ.22లక్షలు దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కాటేదాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాటేదాన్‌లోని మైలార్‌ దేవుపల్లి లక్ష్మీగూడ హౌసింగ్‌ బోర్డు ఉండే స్థిరాస్తి వ్యాపారి ముజఫర్‌ ఆగస్టు 3వ తేదీన బయటకు వెళ్లగా, నలుగురు దుండగులు ఇంట్లోకి వచ్చి అతని కుమార్తె తస్కీంబాను(20)ను చితకబాది అల్మారాలోని రూ.22 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
శంషాబాద్‌ మండలం నాగారం గ్రామానికి చెందిన అష్రఫ్‌(22) తస్కీం ప్రేమించుకొంటున్నారు. అష్రఫ్‌ వ్యాపారం చేయాలని, అలాగైతేనే తన తండ్రి అతడిని అల్లుడిగా అంగీకరిస్తాడని తస్కీం భావించింది. వ్యాపారం చేసుకునేందుకు సాయం చేయాలని అనుకుంది. 
 
వారం కింద ముజఫర్‌ తన ప్లాటు విక్రయించగా వచ్చిన రూ.22 లక్షల నగదును అల్మారాలో దాచడాన్ని చూసింది. ఇదే అదనుగా ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి.. డబ్బును దోచేసింది. తండ్రి రాగానే నలుగురు దొంగలు చితకబాది నగదు ఎత్తుకెళ్లినట్లు నమ్మించింది. 
 
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. దాడిపై ఆరా తీశారు. తండ్రి, కూతురుకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ సందేశాలను పరిశీలించారు. దీంతో ఈ నేరానికి అష్రఫ్, తస్కీంబానే కారణమని తేలింది. ఈ నేరానికి అష్రఫ్‌కు సహకరించిన షఫి, మరో యువకుడు, ప్రధాన సూత్రధారి తస్కీంలను అదుపులోకి తీసుకున్నారు. రూ.19.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.