శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (09:06 IST)

తక్కువ మార్కులొచ్చాయనీ కొడుకుని చంపి తాను కూడా...

చదువుకునే పిల్లలను తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనికి కారణం వారి భవిష్యత్‌పై గంపెడాశలు పెట్టుకోవడమే. ఆ లక్ష్య సాధనలో ఏమాత్రం వెనుకంజ వేసినా అభంశుభం తెలియని చిన్నారుల పట్ల కర్కశం

చదువుకునే పిల్లలను తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనికి కారణం వారి భవిష్యత్‌పై గంపెడాశలు పెట్టుకోవడమే. ఆ లక్ష్య సాధనలో ఏమాత్రం వెనుకంజ వేసినా అభంశుభం తెలియని చిన్నారుల పట్ల కర్కశంగా నడుచుకుంటున్నారు. తాజాగా ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయని అతని కన్నతండ్రి ఆ విద్యార్థిని చంపేసీ.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జవహర్ నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జనగాం జిల్లా కుందారం నుంచి హైదరబాద్ నగరానికి వచ్చిన దారం సుధీర్ (42) జవహర్ నగర్‌లోని శ్రీరాంకాలనీలో మెడికల్ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు రజినీతో 15 ఏళ్ల క్రితమే వివాహం కాగా, తేజ (12), కార్తీక్ (10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తేజ 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి తండ్రి సుధీర్ బాధపడుతున్నాడు. కుమారుడి చదువుపై బెంగ పెట్టుకున్నాడు. ఇంట్లో కూడా ఇదే విషయంపై కుమారుడిని తిట్టసాగాడు. 
 
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పెద్ద కుమారుడు తేజను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. రెండు రోజలుగా సిటీలో గాలించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించలేదు. బుధవారం మధ్యాహ్నం ఈ తండ్రీకొడుకుల మృతదేహాలు చెన్నాపురం చెరువులో లభించాయి. ముందు కుమారుడిని చెరువులోకి తోసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
7వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని కొడుకుని చంపి.. ఆత్మహత్య చేసుకోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు స్థానికులు. మెడికల్ షాపు ఓనర్ గా జవహర్ నగర్ ఏరియాలో సుధీర్ అందరికీ పరిచయస్తుడే. అందరితో ఎంతో చనువుగా ఉండే మనిషి.. ఇలాంటి అఘాయిత్యం చేస్తాడని అనుకోలేదంటున్నారు. అయినా 7వ తరగతికే తక్కువ మార్కులు వస్తే బాధపడటం ఏంటని.. ఇది మరీ విడ్డరంగా ఉందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.