శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:24 IST)

ఖాకీలపై నిన్న రాళ్ళు.. నేడు పూల వర్షం .. ట్రెండింగ్‌లో హైదరాబాద్ పోలీసులు టాప్

పశువైద్యురాలు దిశను దారుణంగా హతమార్చిన వారిని ఎన్‌కౌంటర్ చేసి చంపడాన్ని హర్షిస్తున్న ప్రజలు, పోలీసుల చర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు, పోలీసులకు జయజయధ్వానాలు పలుకుతూ, పూలవర్షం కురిపించారు. 
 
బస్తాల్లో పూలు తెచ్చి, పోలీసులపై చల్లుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు స్వీట్స్ తినిపించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో పోలీసులంటే నమ్మకం పెరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. దిశకు న్యాయం జరిగిందని అంటున్నారు. 
 
ఎన్‌కౌంటర్‌లో నిందితులు మరణించడంపై ఎవరూ బాధపడటం లేదని, ఇంత దారుణానికి ఒడిగట్టిన వారికి తగిన శిక్షే పడిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు ఘటనా స్థలి వద్ద జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు, దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ట్విట్టర్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇదే అంశం టాప్‌లో నిలుస్తోంది. నెటిజన్లు ప్రస్తుతం ఇందుకు సంబంధించి అంశాలనే సెర్చి చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌కౌంటర్, హైదరాబాద్ పోలీస్, దిశా కేసు, జస్టిస్ ఫర్ దిశ, తెలంగాణ పోలీస్, హ్యూమన్ రైట్స్, హైదరాబాద్ హర్రర్, బిగ్ బ్రేకింగ్, రిప్ దిశ హ్యాష్ ట్యాగులు ట్విట్టర్‌లో టాప్‌లో నిలుస్తున్నాయి. ట్విట్టర్‌లోని టాప్ ఫైవ్ ట్రెండింగ్‌లో హైదరాబాద్ పోలీస్ ఉండడం విశేషం. టాప్ ఫైవ్‌లో ఉన్న మిగిలిన హ్యాష్ ట్యాగులు కూడా దిశ హత్యోదంతానికి సంబంధించినవే కావడం విశేషం.