శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (09:24 IST)

చూడకూడని భంగిమలో భర్త చూశాడనీ.. ఇద్దరూ కలిసి చంపేశారు...

తెలంగాణ రాష్ట్రంలో మరో భర్త ప్రాణాలు కోల్పోయాడు. అదీకూడా కట్టుకున్న భార్య చేతిలోనే. తమ అక్రమగుట్టు బహిర్గతంకావడంతో ప్రియుడితో కలిసి భార్య ఈ కిరాతక చర్యకు పాల్పడింది. తెలంగాణ రాష్ట్రం, భువనగిరి యాదాద్రి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యాదాద్రి జిల్లా, పోర్లగడ్డతండాకు చెందిన వడ్త్యా గోపి (35) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నాగోలు అల్కాపురిలో ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ అల్కాపురిలో బిల్డింగ్‌ మెటీరియల్‌ విక్రయించే వీరాస్వామి వద్ద పని చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో లక్ష్మీకి వీరాస్వామితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గోపికి తెలిసి మందలిచాడు. అయినప్పటికీ లక్ష్మి ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా, ఓ రోజున వీరాస్వామితో భార్య చూడనికూడని భంగిమలో ఉండటాన్ని గోపి చూశాడు. ఇక అక్కడ ఉండకూడదని భావించిన గోపి... అక్కడ పని మానేసి  కర్మన్‌ఘాట్‌ భూపేష్‌ గుప్తా నగర్‌కు మకాం మార్చాడు.
 
అక్కడ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో గత ఆదివారం చీటి డబ్బుల కోసం కర్మన్ ఘాట్‌కు వీరాస్వామి వెళ్లాడు. అక్కడ గోపీకి వీరాస్వామికి మధ్య ఘర్షణ జరిగింది. అదే రోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన గోపిని హతమార్చాలని లక్ష్మీ భావించింది. ఈ విషయాన్ని వీరాస్వామికి చేరవేసింది. దీంతో వీరాస్వామి కూడా స్నేహితుడు రాములును వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడు. 
 
అప్పటికే మద్యం సేవించడం వల్ల గాఢనిద్రలోకి జారుకున్న గోపిని లక్ష్మి, వీరాస్వామి, రాములు కలిసి గొంతు నులిమి ముఖం, ఛాతిపై పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్న గోపి తండ్రి బద్యా చంద్రుకు ఫోన్‌ చేసి గోపి గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించింది. 
 
అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు గోపి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పోర్లగడ్డతండాకు తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన బంధువులు శరీరంపై తీవ్ర గాయాలు, గొంతు కమిలిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హత్యగా నిర్ధారించారు. 
 
దీంతో లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించింది. ఆ తర్వాత కేసు నమోదు చేసి లక్ష్మీతో పాటు వీరస్వామి, రాములను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.