1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:41 IST)

వాడు నన్ను గదికి రమ్మంటున్నాడు.. చనిపోతున్నా.. ఇంటర్ విద్యార్థిని

ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో ఓ యువకుడి వేధింపులను భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరణించేందుకు ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు.
 
తాను తప్పు చేయలేదని.. బతకాలని వున్నా.. వాడు బతకనివ్వట్లేదని.. తన గదికి రావాలంటున్నాడని ఆ లేఖలో ఇంటర్ విద్యార్థిని రాసుకొచ్చింది. అలా రాకపోతే.. తన ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నానని తెలిపింది. ఆ ఫోటులు బయట పెట్టకపోవడం వల్లే తన ఆత్మకు శాంతి అని.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దని ప్రాధేయ పడుతూ ప్రాణాలు విడిచింది.
 
అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.