మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (20:08 IST)

మా గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహారం.. చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కటం అలవాటుగా మారిందని, విధిలేని పరిస్థితిలోనే స్పీకర్కు దండం పెట్టి బయటకు వచ్చామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... 
 
"అసెంబ్లీలో మావాళ్ల గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జగన్ ఎన్నకల సమయంలో 45యేళ్లకే పెన్షన్ ఇస్తాం అని ప్రకటించారు. జగన్ వ్యాఖ్యలు సాక్ష్యాలతో సహా మా సభ్యులు చూపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మా డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేశారు. నేను వచ్చాక దీనిపై మాట్లాడుతూ ఉంటే నా మైక్ కట్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ కూడా న్యాయబద్దంగా వ్యవహరించాలి. 
 
ఈరోజు మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఈరోజు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ప్రభుత్వం చెప్పలేక పోతుంది. ఎప్పుడో జరిగిన కృష్ణా, గోదావరి పుష్కరాలను లేవనెత్తారు. సభలో నేను ఉండాగానే సాక్ష్యాలు లేకుండా నాపై  ఆరోపణలు చేశారు. మేము రైతులకు పది వేలు ఇస్తామని, కేంద్రం అదనంగా ఇస్తుందని చెప్పాం. 
జగన్ 12,500 ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం ఆరు వేలు, రాష్ట్రం ఆరు వేలు అని మోసం చేస్తున్నారు. ఇదేనా జగన్ .. మాట తప్పం, మడమ తిప్పం అంటే. 
 
సున్నావడ్డీకే రుణాలను మేము ఇస్తే... దానిని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు. 3,500కోట్లి ఇస్తామని రైతులకు వంద కోట్లు కేటాయించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రశ్నిస్తే... మా వాళ్లను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. వరల్డ్ బ్యాంకు నిధులు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తుంది. 
 
టిడిపి హయాంలో విశ్వసనీయత వల్ల ఏడు వేల కోట్ల రుణం ఇచ్చింది. నిబంధనల మేరకు నడుచుకోకుంటే.. జరిమానా కూడా విధిస్తుంది. విద్యుత్ కొనుగోలు విషయంలో రాజకీయం చేయాలని చూసి దెబ్బతిన్నారు. అమరావతిని బంగారు బాతు గుడ్డుగా చేయాలని మేం తపన పడ్డాం. వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించి అమరావతిని చంపేశారు. 
 
మన రాజధాని అనే భావనతో 33 ఎకరాలను రైతులు ఇచ్చారు. రాజధానిలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. ఇంత అరాచకం అయిన అసెంబ్లీని నా‌ జీవితంలో చూడలేదు. మావైపు చూసే సాహసం కూడా స్పీకర్ చేయటం లేదు. వాకౌట్ కోసం మైక్ ఇవ్వకపోవటం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.