శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (14:46 IST)

అమ్మతోడు.. నారా లోకేష్‌ను ఇంతవరకు చూడనేలేదు : జె.శేఖర్ రెడ్డి

తనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఇసుక కాంట్రాక్టర్ జె.శేఖర్ రెడ్డి స్పందించారు.

తనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఇసుక కాంట్రాక్టర్ జె.శేఖర్ రెడ్డి స్పందించారు. నారా లోకేశ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదనీ, అసలు ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. పైగా, ఆయన్ను తన జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ కలుసుకోలేదని, ఆయనను చూడనే లేదని చెప్పారు. 
 
తనతో లోకేశ్‌కు సంబంధాలున్నాయని, దానికి సంబంధించి ప్రధాని మోడీ వద్ద సమాచారం ఉందని, అందుకే చంద్రబాబు భయపడుతున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన తర్వాత శేఖర్ రెడ్డి ఓ పత్రికతో మాట్లాడారు. తమిళనాడులో ఎన్నికలకు పోటీ చేసే కొందరు రాజకీయ నాయకులు తనను పిలుస్తారని, తాను వస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తారని.. బహుశా తన పేరు ఉచ్చరిస్తే సెంటిమెంటల్‌గా జనసేన కూడా విజయం సాధిస్తుందని పవన్‌కు ఎవరో చెప్పి ఉంటారని శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
 
పవన్‌ను తాను టీవీల్లో, సినిమాల్లో చూడటం తప్ప నిజజీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా రెండేసార్లు కలుసుకున్నానని చెప్పారు. తనను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినప్పుడు కొండమీద పద్మావతి గెస్ట్‌ హౌస్‌లో మిగతా సభ్యులతో పాటు సీఎంను కలిసి ఫొటో తీసుకున్నామని తెలిపారు. తర్వాత ఒకసారి తిరుపతి వచ్చినప్పుడు ఆయనకు ప్రసాదం ఇచ్చేందుకు వెళ్లానని చెప్పారు. తనను టీటీడీలో సభ్యుడిగా తమిళనాడు కోటా నుంచే నియమించారని, తన పేరును నాటి ముఖ్యమంత్రి జయలలిత సిఫారసు చేశారని శేఖర్‌రెడ్డి గుర్తుచేశారు.