1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (08:39 IST)

అది జగన్ పెట్టిన చిచ్చేనా? బీజేపీ ధిక్కార స్వరంపై టీడీపీ అనుమానాలు

తెలుగుదేశం పార్టీకీ, భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తులో వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి వాస్తవంగానే చిచ్చుపెట్టారా? బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఫిరాయింపుదార్లకు మంత్రిపదవ

తెలుగుదేశం పార్టీకీ, భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తులో వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి వాస్తవంగానే చిచ్చుపెట్టారా? బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులు కట్టబెట్టిన విషయమై ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలకు రాసిన లేఖ టీడీపీలో తీవ్ర అసంతృప్తికి, అంతర్మథనానికి దారి తీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రత్యక్ష దాడికి దిగుతూ పురందేశ్వరి రాసిన లేఖ టీడీపీని షాక్‌కు గురిచేసింది.
 
పురందేశ్వరపై ఖండనమండనలతో ఆమె లేఖ విషయాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నించిన టీడీపీకి అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరో పెద్ద ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు స్థానంలో తాను ఉన్నట్లయితే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను తమ పదవులకు రాజానామా చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునేవాడినని విష్ణు చేసిన ప్రకటనతో టీడీపీ నివ్వెరపోయింది.  పైగా చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. పలువురు బీజేపీ నేతలు కూడా తమ ప్రయివేట్ సంభాషణల్లో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. 
 
సహజంగానే బీజేపీలో మారిన వైఖరి టీడీపీని ఆగ్రహానికి గురి చేసింది. ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకుపోవడానికి పొత్తు ధర్మానికి ఏ సంబంధమూ లేనప్పటికీ బీజేపీ నేతలు ఎందుకంత తీవ్రస్తాయిలో స్పందించారో టీడీపీ నేతలకు అర్థంకాక ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు కానీ తతిమ్మా బీజేపీ నేతలను పల్లెత్తు మాట అనడానికి సాహసించలేకపోయారు. 
 
ఇది చాలదని ఏపీ బీజేపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ నేరుగా వైకాపా అదినేత పత్రిక సాక్షి సంపాదక పేజీలో నిస్సందేహంగా అనైతికమే అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతూ పెద్ద వ్యాసమే రాయడం ఇంకొక సంచలనం. ప్రధానమంత్రి పదవినే వాజపేయి ఫణంగా పెట్టి ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోయారు తప్ప ఫిరాయింపులకు దిగలేదని, వైకాపా అధినేత సైతం తాను కాంగ్రెస్ పార్టీనుంచి వైదొలిగినప్పుడు తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మరీ తన పార్టీలోకి తీసుకున్నారని పురిఘళ్ల వ్యాఖ్యానించడం టీడీపీకి పుండుమీద కారంలాగ తగిలింది.
 
పైగా పొత్తులో భాగంగా దేన్నయినా సమర్ధిస్తాం కానీ టీడీపీ సాగించే ఫిరాయింపులను కాదని పురిఘళ్ల తన సాక్షి వ్యాసంలో తేల్చి చెప్పడం విశేషం. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప బీజేపీ నేతలు ఇలా వరసపెట్టి టీడీపీని ఏకడం సాధ్యం కాదన్నది స్పష్టం.