1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (12:03 IST)

జగన్ రెడ్డీ.. దేనికి ఈ గర్జనలు : పవన్ కళ్యాణ్ ప్రశ్న

pawan kalyan
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పేరిట ఈనెల 15న వైకాపా ఆధ్వర్యంలో రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ర్యాలీ చేపట్టనుంది. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. దేనికీ గర్జనలు? అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి అనేక ప్రశ్నలు సంధించారు. 
 
'దేనికీ గర్జనలు?.. మూడు రాజధానులతో ఇంకా అధోగతి పాల్జేయడానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? 
 
మత్స్యకారులకు సొంతతీరంలో వేటకు అవకాశం లేక మత్స్యకారులు గోవా, గుజరాత్‌, చెన్నై వెళ్తున్నందుకా? విశాఖపట్నంలో రుషికొండను ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకుంటున్నందుకా? దసపల్లా భూములు మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలిచ్చినందుకా?' అని పవన్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.