గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (08:58 IST)

ఇపుడు మా వంతు వచ్చింది.. భయపడం... చెట్టుకిందైనా బతుకుతాం : జేసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారని, ఇందులోభాగంగానే తమ కుటుంబాన్ని తొలుత టార్గెట్ చేశారని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ.. భయపడే ప్రసక్తే లేదనీ, అరెస్టుకు అంతకంటే భయపడేది లేదన్నారు. 
 
లారీ ఛాసిస్ కొనుగోళ్ల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
 
ఈ కేసులో ఏ1ను వదిలివేసి తమను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా, అధికార పక్షానికి అశోక్ లేలాండ్ నుంచి ఏమి ఆమ్యామ్యా ముట్టిందో ఏమోనని వ్యాఖ్యానించారు.
 
తమ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై అనేక కేసులు ఉన్నాయన్నారు. ముఖ్యంగా, డేంజర్ లైట్ లేదని, వైపర్ లేదని, సీటు శుభ్రంగా లేదని కేసులు నమోదు చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
"మా డ్రైవర్లు సీటు బెల్టు వేసుకోలేదని కూడా కేసు వేశారు. ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో డ్రైవరు సీటు బెల్టు వేసుకోవడం చూశారా? ఈ విషయంలో కోర్టుకు వెళితే, అధికారుల నుంచి నష్టపరిహారం కోరాలని న్యాయస్థానం సూచించిందని చెప్పారు. అయితే అధికారులపై మానవతా దృక్పథంతో మేము వారిపై చర్యలకు దిగలేదు" అని జేసీ వెల్లడించారు.
 
"మావాడు సాక్షి పేపర్ ఆఫీసు ఎదుట ఎప్పుడో ఓసారి ధర్నా చేశాడు. అప్పుడు ఏదో పదప్రయోగం చేశాడు. ఏదో ఊతపదం వాడాడేమో. దాన్ని పట్టుకుని రాయలసీమ బుద్ధి చూపించారు. ఆర్థికమూలాలు దెబ్బతీసి రోడ్డున పడేట్టు చేయడమే సీమ పద్ధతి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా గతంలోనూ లేడు, మున్ముందూ రాడు. ఆయన అల్లాకు, ఏసుకు, శ్రీశైలం మల్లన్నకు భయపడడు కానీ ఎక్కడో ఉన్న మోదీకి భయపడతాడు.
 
ఇపుడు తమ వంతు వచ్చిందన్నారు. అయినా అరెస్టుకు భయపడేది లేదన్నారు. నాకుంది పది ఎకరాలు. నేను నా భార్య చెట్టుకిందైనా బతకగలం. నా పిల్లలు బాగా చదువుకున్నారు. ఎలాగో బతుకుతాం అంటూ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఇక ఎవర్ని టచ్ చేసినా ఏం జరుగుతుందో తెలియదు కానీ, చంద్రబాబునాయుడ్ని టచ్ చేస్తే మాత్రం ఏపీలో తిరుగుబాటు రావడం ఖాయమని జేసీ హెచ్చరించారు.