శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Modified: బుధవారం, 10 మే 2017 (13:26 IST)

11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలి.. నిషిత్ మృతి దారుణం: జేసీ

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దారుణమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. యువకులు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్తను జీర్ణించుకోవడం కష్టమన్నారు.

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దారుణమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. యువకులు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్తను జీర్ణించుకోవడం కష్టమన్నారు. ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఇంకా నిషిత్ మృతి పట్ల జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు నిషిత్ మృతి పట్ల టీడీపీ నేత నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కన్న కుమారుడిని కోల్పోతే ఎంత బాధ వుంటుందో తనకు తెలుసునని, మూడేళ్ల క్రితం తన కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధించిందనే విషయాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
 
నిషిత్ మృతి నేపథ్యంలో నారాయణ కుటుంబానికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అపోలోలో నారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్‌ను బెంజ్ కారు ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి ధైర్యం చెప్పారు.