1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (19:04 IST)

జగన్ మోహన్ రెడ్డి అక్కడికి ఎందుకు వెళ్లలేదు? జూపూడి ప్రభాకర్ ప్రశ్న

అమరావతి: నక్సలైట్లు ఏ వర్గాల కోసం పని చేస్తున్నారో ఆ వర్గాలకు ప్రతినిధులుగా ఎదుగుతున్నవారిని కాల్చి హత్య చేయడం అమానుష చర్యగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు పేర్కొన్నారు.

అమరావతి: నక్సలైట్లు ఏ వర్గాల కోసం పని చేస్తున్నారో ఆ వర్గాలకు ప్రతినిధులుగా ఎదుగుతున్నవారిని కాల్చి హత్య చేయడం అమానుష చర్యగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలను టీడీపీ ఖండిస్తుందన్నారు.


సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేశ్వర్రావు 2007-09 మధ్య కాలంలో తనతోపాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నారని, ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. ఆయన టీడీపీలో చేరినందుకు రూ.12 కోట్లు తీసుకున్నారని, ఆ డబ్బుతో మైనింగ్ నిర్వహిస్తున్నారని అందువల్లే ఆయనను నక్సల్స్ హత్య చేసినట్లు ప్రతిపక్ష వైసీపీ నేతల ఆరోపణలు సాక్షి పత్రికలో ప్రచురించారని చెప్పారు. 
 
అంతా వారు దగ్గర ఉండి చూసినట్లుగా లేదా వారి మనిషి అక్కడ ఉన్నట్లు రాశారన్నారు. పోలీసుల విచారణలో అవన్నీ చెప్పాలన్నారు. వైసీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుందని అర్థం వచ్చేవిధంగా మాట్లాడుతున్నారని, వారిని వ్యతిరేకిస్తే ఇతరులతో కలిసి హత్య చేయిస్తారా? అని ప్రశ్నించారు. హత్యలు జరిగిన సమీపంలోనే ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, సంఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదని అడిగారు. 
 
వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. సర్వేశ్వరరావు ప్రజల మధ్య ఉన్న మనిషని, అటువంటి వ్యక్తిని హత్య చేసిన నక్సల్స్ వ్యవహారాలు, తెలివితేటలు తెలియనివి కావని అన్నారు. వైసీపీ వారిలో మిత్ర వైరుధ్యం కనిపించడంలేదని, శత్రు వైరుధ్యం కనిపిస్తోందని, అది తప్పుడు విధానమని ఆయన పేర్కొన్నారు. టిడీపీని తిట్టడం వైసీపీకి అలవాటైపోయిందన్నారు. నక్సల్స్ చర్యని వైసీపీ ఖండించకపోవడం అన్యాయం అన్నారు. ఆ పార్టీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధంగా పని చేస్తోందన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు.