శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (15:57 IST)

మంత్రి పదవి లేదా రూ.100 కోట్ల ఆఫర్‌.. ఎవరికి ఎవరు ఆఫర్ చేశారు?

విజయవాడలో మంచిపట్టున్న నేతగా వంగవీటి రాధాకు గుర్తింపు ఉంది. ఈయన వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అలాంటి వంగవీటి రాధాకు ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ.పాల్ నుంచి ఊహించని ఆహ్వానం వచ్చింది. 
 
తన పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో రూ.100 కోట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేగానీ, తెలుగుదేశం పార్టీకి మాత్రం అమ్ముడు పోవద్దని ఆయన ప్రాధేయపడ్డారు. అదేసమయంలో తాను స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణను ఆయన ఆహ్వానించారు.
 
ప్రజాశాంతి పార్టీలో చేరితే తాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ హామీని నెరవేర్చలేకపోతే రూ.100 కోట్లు చెల్లిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తండ్రిని చంపిన టీడీపీలో చేరితే వంగవీటి రాధాకృష్ణను కాపులు జీవితంలో క్షమించరని డాక్టర్ పాల్ హెచ్చరించారు. 
 
కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధా.. రాష్ట్ర విభజన తర్వాత వైకాపాలోకి వెళ్లారు. కానీ అక్కడ కూడా నిలదొక్కులేకపోయారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నిజానికి వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగాను తెలుగుదేశం పార్టీ నేతలు హత్య చేయించారనే ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే.