మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 22 అక్టోబరు 2016 (15:14 IST)

అధికారుల‌తో పోరాటం నా వ‌ల్ల కాదు... చావుకు అనుమ‌తి కోరిన బాషా

క‌డ‌ప‌: ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కారులో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారట. ఆ సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ఒక పేద రైతు తన ఇంటి బయట కనిపించారు. దీంతో వెంటనే కారు ఆపించిన విజయభాస్కర్‌ రెడ్డి … దగ్గరకు పిలిచి ఎందుకు వచ్చావు అని

క‌డ‌ప‌: ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కారులో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారట. ఆ సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ఒక పేద రైతు తన ఇంటి బయట కనిపించారు. దీంతో వెంటనే కారు ఆపించిన విజయభాస్కర్‌ రెడ్డి … దగ్గరకు పిలిచి ఎందుకు వచ్చావు అని సదరు రైతును అడిగారట. అందుకు తనకొచ్చిన సమస్యను ఆ పేద రైతు ముఖ్యమంత్రి కోట్ల వద్ద చెప్పుకున్నారు. వెంటనే అక్కడే ఉన్న అధికారులను పిలిచి ఆ పేద రైతు సమస్యను పరిష్కరించాలని సూచించారు. అయితే అందుకు రూల్స్ ఒప్పుకోవు సార్ అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. దీంతో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి… ”అన్నీ రూల్స్‌ ప్రకారమే చేయాలనుకుంటే, ఇక రాజకీయ నాయకులు ఉన్నదెందుకు?. రూల్స్ ఫాలో అయ్యే మీరు (అధికారులు) ఉంటే సరిపోతుంది కదా?. 
 
రూల్స్ పాటించాల్సిందే. కానీ ఎదుటివాడికి వచ్చిన కష్టం ఏంటో కూడా అర్థం చేసుకుని, మనసుతో కూడా ఆలోచించాలి” అని సూచించారు పెద్దాయన. రైతుకు సాయం చేసే పంపించారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి చెప్పిన మాట పక్కాగా రూల్స్ ఫాలో అయ్యే వారికి నచ్చకపోవచ్చు.. కానీ ఆ పేదోడి స్థానంలో నిలబడి ఆలోచిస్తే మాత్రం వ్యవస్థ నిజానికి ఎలా పనిచేయాలో అర్థమవుతుంది. బహుశా ఇటీవల మన పాలకుల్లో, అధికారుల్లో ఆ సున్నితత్వమే లోపిస్తున్నట్టుగా ఉంది.
 
కడప జిల్లాలో ఒక వికలాంగుడి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఆడిన ఆట కూడా అలాంటిదే. ఇప్పుడు సదరు వికలాంగుడు ”మీతో పోరాటం చేయలేను, అలాని సొంతంగా బతకలేను కాబట్టి చచ్చిపోయేందుకు అనుమతి ఇచ్చి పుణ్యం కట్టుకోండి” అని కడప కలెక్టరేట్‌లో అధికారులను వేడుకున్నాడు. కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాలకు చెందిన మహబూబ్‌ బాషాకు డాక్టర్‌ 80 శాతం అంధుడని సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని తీసుకుని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. అక్కడా అదే నిర్లక్ష్యం. చివరకు సొమ్మసిల్లి చెట్ల కింద పడిపోయిన బాషాను చూసి స్పందించిన ఒక విలేకరి జాయింట్‌ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే వ్యవస్థపై విసిగిపోయిన మహబూబ్‌ బాషా తన సమస్యను కూడా మరిచిపోయాడు. తాను బతకలేనని చచ్చిపోయేందుకు అనుమతించాలని జాయింట్ కలెక్టర్ శ్వేతను వేడుకున్నారు. అసలు బాషాకు ఎందుకు పించన్ రాలేదని ఆరా తీయగా తేలిందేమిటంటే సిస్టమ్‌లో రూల్స్‌ను ఫాలో అయ్యేవారే తప్పా మనసుతో ఆలోచించే వారు లేకపోవడమేనని తేలింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఒక ఇంటిలో ఒకరికే పించన్ అన్న నిబంధనను పెట్టింది.
 
బాషా సోదరి కమాల్‌బీ కూడా వికలాంగురాలే కావడంతో అతడి ఇంటి నుంచి ఆమె పించన్ తీసుకుంటున్నారు. దీంతో 80 శాతం అంధుడైన బాషాకు పించన్ ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోలేదు. రూల్స్‌ను మాత్రమే బట్టీ కొట్టిన అధికారులు కూడా… వాటిని పట్టుకునే వేలాడారు. వికలాంగుల పించన్ అంటేనే వారు సొంతంగా బతకడం కష్టం కాబట్టి చేయూతగా ఇచ్చేది. మరి ఒక ఇంటిలో ఇద్దరు వికలాంగులు ఉంటే ఒక పించనే వారిద్దరికి సరిపోతుందా?. అంటే ఒక కుటుంబంలో ఒక వికలాంగుడు ప్రభుత్వం ఇచ్చే పించన్‌ తీసుకుంటే ఆ పించన్‌ సాయంతోనే ఇంటిలోని మిగిలిన వికలాంగుల కష్టనష్టాలు కూడా తీర్చేయగలమని అనుకోవచ్చా?. పించన్‌ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ముసలివాళ్లకు పెద్దకొడుకుగా మారానని చెబుతున్న చంద్రబాబు… ముసలిదంపతుల్లో ఒకరికి మాత్రమే అన్నం పెట్టే బాధ్యత తీసుకున్నారా?. వికలాంగులకు పెద్దన్నగా అండగా ఉంటానని చెబుతున్న చంద్రబాబు…ఒకే ఇంటిలో ఇద్దరు వికలాంగులుంటే ఒకరి బాధ్యత మాత్రమే తీసుకుంటారా?. ఇదీ ఇపుడు ఆ బాధితుడు అడుగుతున్న ప్ర‌శ్న‌.