శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 29 మే 2019 (17:39 IST)

కేసీఆర్ - జగన్ ఫ్రెండ్‌షిప్.. పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల సమస్యలు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలపై విస్తృత చర్చ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలుంటాయని పలువురు నేతలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలుకు పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్య అధికారులు భేటీ అయ్యి పలు విభజన సమస్యల పై సమావేశం అయ్యి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన కొలిక్కి రాలేదు. విద్యుత్తు బకాయిల చెల్లింపుపైనా సందిగ్ధత నెలకొంది. వివిధ శాఖల ఉద్యోగుల విభజన ఎడతెగని సమస్యగా తయారైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించింది. కృష్ణా జలాల వాడకంపైనా రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌  మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఉన్నత విద్యామండలి నిధుల పంపకం తేలలేదు. ఈ సంస్థలకు సంబంధించి వందల కోట్ల నిధులు బ్యాంకు ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. 
 
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన పూర్తి చేయాల్సి ఉంది. ఇలా చాలా అంశాలపై స్పష్టత కోసం అధికారులు నాలుగున్నరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పలుమార్లు భేటీ అయినా ఫలితం లేకపోయింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారుల వద్ద తరచూ సమావేశమవుతున్నా చర్చలకే పరిమితమవుతున్నారు. రెండు ప్రభుత్వాల చొరవతో ఇలాంటివన్నీ పరిష్కరించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే విభజన సమస్యల పరిష్కారం కోసం త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్య అధికారులు సమావేశం అయిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.