ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (09:42 IST)

అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే తొలిసారి.. ఏకంగా కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ..?

తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి సారి. అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే తొలిసారి. ఓ ప్రభుత్వాధికారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. కోటి. పది లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే ఈ ఘటనలో బాధితులెవ్వరూ ఫిర్యాదు చేయకుండానే నేరుగా ఏసీబీ అధికారులే నిఘా పెట్టి నాగరాజ్ అనే అతి పెద్ద అవినీతి వ్యక్తిని పట్టుకున్నారు. 
 
నాగరాజ్ కీసర తహశీల్దార్ కాగా, ఇతడిని నోట్ల కట్టల్లో ముంచేసి భూముల్ని కొట్టేద్దామనుకున్న ఓ ప్రముఖ నేత అనుచరుడిని, మరో్ దళారిని, వీఆర్ఏను ఈ ఘటనలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా, కీసర మండలం రాంపల్లి దాయర సర్వే నెంబర్లు 604 నుంచి 614 వరకు పూర్వీకుల నుంచి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్తర్వులు జారీచేశారు. మిగిలిన 28ఏకరాలకు సంబంధించి భూ వివాదం అప్పటినుంచి కొనసాగుతూనే ఉంది. రైతులు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. 
 
ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ స్థిరాస్తి వ్యాపార సంస్థ కన్ను వీటిపై పడింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే భాధ్యతను ఓ పార్టీకి చెందిన సీనియర్ నేత అనుచరుడు కీసరకు చెందిన అంజిరెడ్డి, ఉప్పల్‌కు చెందిన దళారి శ్రీనాధ్, తీసుకున్నారు. తప్పుడు పత్రాలతో పాసు పుస్తకాలు ఇప్పించేందుకు చక్రం తిప్పారు. ఈ విషయంలో సాయం చేస్తే భారీగా ముట్టజెపుతామంటూ కీసర తహశీల్దారు నాగరాజ్ ఇంటికి అంజిరెడ్డి, శ్రీనాథ్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. 
 
అప్పటికే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు నాగరాజ్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తహశీల్ధార్ ఇంట్లో మరో రూ. 25లక్ష్లలు దొరికాయి.