శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:53 IST)

హరికృష్ణ మీ చుట్టమా? ఎవడబ్బ సొమ్మని స్థలం కేటాయించారు? కేసీఆర్‌కు కొండా సురేఖ ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ను ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి కొండా సురేఖ ఏకిపారేశారు. టీడీపీకి చెందిన సీని నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరణించిన

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ను ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి కొండా సురేఖ ఏకిపారేశారు. టీడీపీకి చెందిన సీని నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరణించిన తర్వాత స్మారక స్థూపం కోసం ఎవడబ్బ సొమ్మని తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని కొండా సురేఖ ప్రశ్నించారు.
 
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, కేసీఆర్‌‌కు రాసిన బహిరంగ లేఖలో పలు విమర్శలు గుప్పించారు. హరికృష్ణ స్మారకానికి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనేమీ తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదని, కేసీఆర్‌‌కు చుట్టమేమీకాదని, అమరవీరుల కుటుంబ సభ్యుడు అంతకన్నా కాదని, స్థలాన్ని ఎందుకు కేటాయించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.
 
ముఖ్యంగా, హరికృష్ణ మరణించిన నిమిషాల వ్యవధిలోనే, కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అక్కడికి వెళ్లారని, అంత్యక్రియలు పూర్తయ్యే దాకా కేటీఆర్ అక్కడే ఉన్నారని గుర్తు చేసిన ఆమె, తెలంగాణ భూమిని ధారాదత్తం చేశారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ సీఎం టీ అంజయ్య భార్య మణెమ్మ చనిపోతే పరామర్శించేందుకు కేసీఆర్‌కు తీరిక లేకపోయిందని నిప్పులు చెరిగారు.
 
తెలంగాణ పార్టీలో ఏ పదవినీ ఆశించకుండా పనిచేస్తున్న తనను ఇప్పుడు మెడ పట్టుకుని బయటకు గెంటినట్టుగా కేసీఆర్ చేశారని వాపోయారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకనే టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని చెప్పారు. పార్టీలో ఎన్నో అవమానాలు తనకు ఎదురైనా, కేసీఆర్ మీద గౌరవంతో ఎన్నడూ బయటపడలేదన్నారు. తనకు అసెంబ్లీ సీటును నిరాకరించడం వెనకున్న కారణాన్ని కూడా చెప్పలేదని విమర్శించారు.
 
కేసీఆర్‌ను నమ్మినందుకు తనకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించిన కొండా సురేఖ, ఓ మహిళగా, నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న తనను మంత్రివర్గంలోకి తీసుకోకున్నా సర్దుకు పోయానని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా తన గౌరవాన్ని దెబ్బతీశారని, ఇది తనకెంతో బాధను కలిగించిందని అన్నారు. తన పుట్టిన రోజున కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నించి కూడా తాను విఫలమయ్యానని చెప్పారు.
 
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే, ప్రజా వ్యతిరేకత పెరిగి ఓడిపోతానన్న భయాందోళనలతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారని ఆరోపించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి, పరిపాలించాలని ప్రజలు ఓటేసి గెలిపిస్తే, ఇలా ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో కేసీఆర్ స్వయంగా తెలియజేయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.